ఏడాదికి 100 కోట్లిస్తే ఏ మాత్రం సరిపోదు: వెంకయ్యకు కేసీఆర్ లేఖ
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్యకు తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం లేఖ రాశారు. వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఆర్ధిక సాయం అందజేయాలని అందులో పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీ పథకంలో చేర్చిన హైదరాబాద్లో కేవలం రూ.100 కోట్లతో సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యంకాదని సీఎం కేసీఆర్ అందులో పేర్కొన్నారు. రూ.5,500 కోట్లు వార్షిక బడ్జెట్ కలిగిన జీహెచ్ఎంసీకి ఏడాదికి కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఇస్తే ఎటువంటి పనులు చేపట్టలేమన్నారు.
విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్ అవసరాలు గుర్తించి నిధులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 625 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి హైదరాబాద్ ఏ-1 కేటగిరి నగరంగా ఉందన్నారు. హైదరాబాద్ స్థానంలో స్మార్ట్ సిటీగా కరీంనగర్ను ఎంపిక చేయాలని ఆయన పేర్కొన్నారు.
దీంతో కరీంనగర్లో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి సాధ్యమవుతోందని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, డ్రైనేజీ, రవాణా తదితర మౌలిక రంగాల కోసం ప్రత్యేక ప్రణాళికల్ని అమలు చేయాల్సి ఉందన్నారు.

యాదాద్రి అభివృద్ధికి భూసేకరణ పూర్తి: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ పూర్తైనట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాల అభివృద్ధిపై మంత్రి నేడు దేవాదాయశాఖ అధికారులతో గురువారం ఆయన సమీక్ష సమావేశం జరిపారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియ పూర్తి అయిందన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. యాదగిరిగుట్టపై శిల్పకళావేదిక ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం ఉందని తెలిపారు. దీంతో పాటు వేములవాడలోని రాజన్న ఆలయాన్ని 85 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications