భయపడొద్దు, నేనున్నా- సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రేవంత్ హామీ..!!
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. సభలో మున్సిపల్.. పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం పైన పార్టీలు అభిప్రాయాలు వ్యక్తం చేసాయి. బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేసారు. ఇదే సమయంలో రేవంత్ చేసిన కామెంట్స్ ఆసక్తి కరంగా మారాయి.
బీసీ రిజర్వేషన్ల అమలు పై తెలంగాణ అసెంబ్లీలో బిల్లులో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల మాట్లాడారు. తమిళనాడు తరహాలో వెళ్తే మీ వెంట తాము మద్దతుగా నిలుస్తామని చెప్పుకొచ్చారు. గతంలో కూడా బిల్లులు పంపిస్తే రాలేదు.. అందుకే తమ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జీవోలు ఇవ్వగానే కోర్టుల్లో నిలవదు.. రాజ్యాంగ పరిధిలో 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు. తమిళనాడులో జయలలిత చేసిన తరహాలో ఆలోచన చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం వెంట తామూ వస్తామని.. బిల్లు పాస్ కావాలి.. జీవో రావాలి.. ఎలాంటి న్యాయపర చిక్కులు ఉండవద్దనేదే తమ ఆలోచనగా గంగుల వివరించారు.

42 శాతం రిజర్వేషన్లు తమ పార్టీ సమర్థించిందని గంగుల చెప్పారు. పార్లమెంటులో బిల్లు పాస్ చేస్తేనే 42 శాతానికి ప్రొటెక్షన్ దొరుకుతుందని విశ్లేషించారు. ఈ సమయంలో సీఎం రేవంత్ స్పందించారు. వందేళ్ల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని వివరించారు. వెనుక ఉన్న పెద్దల ఒత్తిడికి భయపడవద్దని గంగుల కమలాకర్కు సూచిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. గంగుల తనకు మాజీ సహచరుడని.. ఏ ఇబ్బంది వచ్చినా తాను ఉన్నానని రేవంత్ వ్యాఖ్యానించారు. మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లును స్వాగతించాల్సింది పోయి విమర్శలు సరికాదని పేర్కొన్నారు. ఐదుసార్లు ప్రధానికి లేఖ రాశామని... అపాయింట్మెంట్ ఇవ్వలేదని రేవంత్ వెల్లడించారు. బలహీనవర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందవద్దనేదే ఆ పార్టీ సిద్ధాంతమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వాటిని అమలు చేస్తున్నామని స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications