రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలం, వారికే ఇవ్వాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు
నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం గృహ నిర్మాణశాఖపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్ లకు మౌలిక వసతులు కల్పించి, వాటిని అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. మరోవైపు, దసరా నాటికి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. గ్రామ/వార్డు, మండల/పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు విధివిధానాలు ఒకట్రెండు రోజుల్లో రూపొందించాలని సూచించారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటే.. ఈ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉందన్నారు సీఎం రేవంత్. ఈ దఫా కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ట సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు రాబట్టాలన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సీఎం సూచించారు. మరోవైపు, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, సభ్యులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియ చేపట్టేందుకు అవసరమైన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.
బీసీ కుల గణన కోసం వెంటనే కార్యాచరణ ప్రారంభించి, వేగంగా పూర్తి చేయాలని బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులకు సీఎం రేవంత్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి విధానాలను పరిశీలించాలని సీఎం తెలిపారు. బీసీ కులగణన వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications