CM Revanth Reddy: శభాష్ త్రిష!.. కోటి రూపాయల నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మహిళల అండర్ 19 టీ-20 వరల్డ్ కప్ స్టార్ ప్లేయర్, తెలుగు మహిళా క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి మనస్పూర్తిగా అభినందించారు. భవిష్యత్ లో దేశం తరపున మరింతగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా క్రికెటర్ త్రిషకు కోటి రూపాయల నజరానాను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్, తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానాను ప్రకటించిన సీఎం.. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్,ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించారు.
మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి వరుసగా భారత్ రెండో సారి ఛాంపియన్ గా నిలిచింది. టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో భద్రాచలం యువతి గొంగడి త్రిష కీలక పాత్రను పోషించింది. బ్యాట్, బాల్ తో గొంగడి త్రిష అద్భుతం చేసి భారత్ కు రెండోసారి అండర్ 19 వరల్డ్ కప్ అందించింది. ఫైనల్ మ్యాచ్ లోనే కాకుండా ప్రపంచ కప్ టోర్నీ మొత్తం తన అద్భుతమైన ఆటతో త్రిష ఆకట్టుకుంది. ఫైనల్ లో 33 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచి అదరగొట్టింది. బౌలింగ్ లోనూ 3 వికెట్లు తీయడం గమనార్హం. త్రిష చేసిన సెంచరీ ఈ టోర్నీలో హైలైట్ గా నిలిచింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లోని బయుమాస్ ఓవల్ వేదికగా జనవరి 28వ స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో గొంగడి త్రిష సెంచరీతో చెలరేగింది. 53 బంతుల్లో సెంచరీ మార్క్ ను చేరుకున్న త్రిష.. 59 బంతుల్లో 110 పరుగులు చేసింది. అలా అండర్ 19 మహిళల ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించింది.














Click it and Unblock the Notifications