వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు, 15 ఎంపీలు గెలుస్తాం: సీఎం రేవంత్
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టామని.. ఆత్మగౌరవంతో బ్రతికేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ వేదికగా మహిళలకు పిలుపునిస్తున్ననని.. స్వయం సహాయక సంఘాలలో చేరి.. ఆర్థికంగా నిలబడండని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక న్యాయ సమరభేరి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కల్వకుంట్ల గడీలు బద్దలు..
"తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల గడీలను బద్దలు కొట్టి మూడు రంగుల జెండా ఎగరేశాం. ఇక్కడే ప్రజా పాలనకు నాంది పలికాం. ఈ ప్రభుత్వం మూన్నాళ్ల ముచ్చట అని, సంక్షేమపథకాలు అమలు చేయరని, కలిసి ఉండరని చాలా మంది ప్రచారం చేశారు. కానీ నవ్విన వాళ్ల ముందు తలెత్తుకుని నిలబడి.. సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాం. తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా తీర్చిదిద్దాం. కులగణనను పూర్తి చేసి బీసీల లెక్క తేల్చాం. దెబ్బతిన్న ఆర్ధిక వ్యవస్థ ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు వెళుతున్నాం. 18 నెలల్లో రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, రైతు రుణమాఫీ చేసి రైతుల రుణ విముక్తులని చేశాం. వరి వేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. కానీ వరి వేయండి సన్న వడ్లకు బోనస్ ఇస్తామని మేం చెప్పాం.దేశంలోనే అత్యధిక వరి పండించి తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టాం. ఒంటె పెదవుల కోసం నక్క ఎదురు చూసినట్లు రైతు భరోసా వేయొద్దని గోతికాడి నక్కలా ఎదురు చూసారు.కానీ 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా అందించిన ఘనత ప్రజా ప్రభుత్వానిది" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మహిళలకు పిలుపు..
"ఈ వేదికగా సవాల్ విసురుతున్నా. మోదీ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, కెసీఆర్ వస్తాడో రండి. రైతులకు మేలు చేసింది ఎవరో అసెంబ్లీలో చర్చిద్దాం రండి. పేదలకు రూ. 5 భోజనం పెట్టే కార్యక్రమానికి ఇందిరమ్మ పేరు పెడితే. కొందరు సన్నాసులు విమర్శలు చేస్తున్నారు. పేదల సంక్షేమం అంటేనే ఇందిరమ్మ.. ఇందిరమ్మ అంటేనే పేదల సంక్షేమం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు అందించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తాం. మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్ లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాం. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టాం. ఆత్మగౌరవంతో బ్రతికేలా చర్యలు తీసుకున్నాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజా పాలనలో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ వేదికగా మహిళలకు పిలుపునిస్తున్నా.. స్వయం సహాయక సంఘాలలో చేరండి. ఆర్థికంగా నిలబడండి" అని సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పిలుపునిచ్చారు.
60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..
"ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. కిషన్ రెడ్డి, కెసీఆర్ కు సవాల్ విసురుతున్న.. లెక్క ఒక్కటి తగ్గినా నేను క్షమాపణ చెబుతా. 18 నెలల్లో రాష్ట్రానికి 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో 20వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. ప్రపంచంతో పోటీపడేలా మన విద్యా ప్రమాణాలు ఉండాలని ప్రణాళికలు వేసుకున్నాం. యువతకు నైపుణ్యాన్ని అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. వచ్చే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. 2030 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా యువతను తీర్చిదిద్దుతాం. పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. ఈ యుద్ధంలో కల్వకుంట్ల కుటుంబం బద్దలు కావాలి" అని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు..
"వచ్చేవి కార్యకర్తల ఎన్నికలు.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలి. కార్యకర్తలకు నూటికి నూరు శాతం న్యాయం చేసే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య 150 కి పెరకబోతోంది. మహిళా రిజర్వేషన్ రాబోతోంది. 60 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. మీరు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు.. మీ టికెట్ మీ ఇంటికే వస్తుంది. వచ్చే ఎన్నికల్లో వంద అసెంబ్లీ సీట్లు, 15 ఎంపీలు గెలిపిస్తాం. రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ దేశానికి ఆదర్శం
తెలంగాణ దేశానికి ఆదర్శం కాబోతుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణలో విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తెస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కు మోదీ చేసింది ఏంటో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
"మేం చెప్పినవన్నీ ఇచ్చి చూపించాం. అబద్ధాలు చెప్పి కొందరు ఓట్లు అడుగుతారు. మేం అభివృద్ధి, సంక్షేమం చేసి ఓట్లు అడుగుతాం. తెలంగాణలో విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తెస్తున్నాం. తెలంగాణలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం. బీఆర్ఎస్ హయాంలో ఎంత అవినీతి ఉండేదో మీకు తెలుసు. కాంగ్రెస్ వచ్చాక అవినీతి పూర్తిగా తగ్గిపోయింది. హైదరాబాద్ లో కనీసం 25 ప్రభుత్వ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చాయి. హైదరాబాద్ కు మోదీ చేసింది ఏంటో బీజేపీ చెప్పాలి. పహల్గాంలో సంఘటన జరిగితే అందరం కేంద్రానికి మద్దతు ఇచ్చాం. పహల్గాం సంఘటనపై చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగు పెట్టమని డిమాండ్ చేస్తే మీటింగ్ పెట్టారు కానీ మోదీ పాల్గొనలేదు. మేం దేశ సైనికుల కోసం చర్చించే సమయంలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు" అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications