గర్వంగా ఉంది.. "ఆపరేషన్ సిందూర్"పై సీఎం రేవంత్ కామెంట్స్ !
ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భారత పౌరుడిగా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిగా నిలిచి ఐక్యత చాటాల్సిన సమయమిదని అన్నారు. 'జైహింద్' సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఆపరేషన్ సిందూర్ పై రాష్ట్రంలోని అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల అప్రమత్తత అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంలో దేశ సైన్యానికి పూర్తి మద్దతుగా నిలవాలని.. మనం సైన్యం వెంటే ఉన్నామన్న సందేశం ప్రజలకు స్పష్టంగా తెలియాలని సీఎం పేర్కొన్నారు.
అంతే కాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని విభాగాలకు సీఎం దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సీఎం ఫోన్ చేశారు. తక్షణమే బయల్దేరి హైదరాబాద్ రావాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు, పార్టీల విమర్శలు అన్నిటికి విరామం ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ప్రజల రక్షణే ప్రథమ కర్తవ్యం. అందుకే ప్రభుత్వ యంత్రాంగం అత్యవసర స్థితిలో పనిచేయాలని, అన్ని శాఖల అధికారులు, మంత్రులు పూర్తిగా అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. విదేశీ పర్యటనలు కూడా తక్షణమే రద్దు చేసుకోవాలని సూచించారు.

అత్యవసర సేవల విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ, వారు ఎప్పటికప్పుడు సేవలకు సిద్ధంగా ఉండాలన్న సూచనలిచ్చారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించేందుకు 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి అనధికారికంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భద్రతా పరిస్థితులను సమర్థంగా పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింత బలోపేతం చేయాలన్నారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో ఆందోళన పెరిగే అవకాశముందని.. దానిపై ఉక్కు పాదం మోపాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఇతరులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫేక్ న్యూస్ను ఎదుర్కొనడానికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు, అత్యవసర మెడిసిన్ సన్నాహాలు సిద్ధంగా ఉంచాలని సీఎం పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని.. రెడ్ క్రాస్ వంటి సేవా సంస్థలతో సమన్వయం పెంచాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార నిల్వలు తగినంతగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పీస్ కమిటీలతో సమావేశాలు నిర్వహించాలని సీఎం సూచించారు. విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థలు వంటి కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచాలని అన్నారు. హిస్టరీ షీటర్లపై, పాత నేరస్తులపై పోలీస్ డిపార్ట్మెంట్ నిరంతరం నిఘా పెట్టాలన్నారు. దేశ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని.. ఇప్పుడు ఏ విభాగమైనా, ఏ వర్గమైనా అందరూ ఒకే గమ్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications