రైతులకు సీఎం రేవంత్ శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు కూడా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం శనివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా ఇస్తామన చెప్పారు.
ఇందిరమ్మ భరోసా కింద రైతులకు ప్రతి ఎకరానికి ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12 వేల రూపాయలను ఇవ్వడం జరుగుతుందన్నారు.

జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. సాగులో లేని భూములకు రైతుభరోసా ఇవ్వమని స్పష్టం చేశారు. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లకు, పరిశ్రమలకు రైతు భరోసా ఇవ్వడం జరగదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం.. పేద ప్రజలకు పంచడం తమ ప్రభుత్వ విధానమని అన్నారు.
రైతు భరోసాకు ఆమోద ముద్రతోపాటు ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీతోపాటు 22 అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది.
సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ2 వ్యయం 1784 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డిలో భాగంగా ఎదుల-డిండికి 1800 కోట్ల అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 56 గ్రామాలు సమీప మున్సిపాలిటీల్లో విలీనంకు కేబినెట్ ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications