Revanth Reddy: శుభవార్త.. ప్రతి పౌరుడికి హెల్త్ కార్డు..!
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. తెలంగాణలోని ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. సీఎం శనివారం వరంగల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. ప్రొఫైల్ కార్డులో లబ్ధిదారుల బ్లడ్ గ్రూప్ నుంచి వారికున్న ఆరోగ్య సమస్యలను పొందుపరుస్తామని వివరించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుల వల్ల వైద్యం సులభంగా అందించవచ్చని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం విద్య, వైద్యం అందరికి అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఫార్మా రంగం, వైద్య రంగంపై ఎప్పుడు చర్చ వచ్చినా.. అందులో కచ్చితంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉంటుందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతోనే తెలంగాణలో ఐటీ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. తెలంగాణను మెడికల్ టూరిజం హబ్గా మారుస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కొత్తగా ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ శివారులోని శంషాబాద్లో మెడికల్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే వరంగల్కు ఎయిర్ పోర్టు రాబోతుందని వివరించారు. ఓరుగల్లులో హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. స్మార్ట్ సిటీ మిషన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. వరంగల్ లో రేవంత్ రెడ్డి పర్యటన శుక్రవారమే జరగాల్సి ఉంది.. కానీ రేవంత్ ఢిల్లీ లో ఉండడం వల్ల పర్యటన ఒక రోజు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications