తెలంగాణ అభివృద్ధిని అడ్డుపడే శక్తులు బీఆర్ఎస్, బీజేపీలే: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో డ్రై పోర్ట్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు. జపాన్ పర్యటనలో సీఎం నాలుగో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా టోక్యోలు ఏర్పాటు చేసిన తెలుగు సమాఖ్య కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మూసీ నది ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మూసీ ప్రక్షాళనకు అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. "గుజరాత్లో మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే, ప్రయాగరాజ్లో గంగానది ఒడ్డున రివర్ ఫ్రంట్ ఉంటే, మరి తెలంగాణలో మూసీ ప్రక్షాళన ఎందుకు కాకూడదు?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని ఆయన అన్నారు. నాలాల ఆక్రమణలు తొలగించకపోతే, చెరువుల మధ్యలో నిర్మాణాలు కూల్చకపోతే ప్రకృతి మనల్ని క్షమించదని ఆయన హెచ్చరించారు. మూసీ అభివృద్ధికి అడ్డుపడే శక్తులు బీఆర్ఎస్, బీజేపీలే అని ఆయన నిందించారు.

ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే.. మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా.. అని ప్రశ్నించారు. అందుకే హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయాలని చెబుతున్నాని స్పష్టంచేశారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో తెలంగాణకు భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. హైదరాబాద్లో అత్యాధునిక AI డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి NTT డేటా, నెయిసా నెట్వర్క్స్ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10 వేల 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ క్లస్టర్ రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి. మరోవైపు, తోషిబా సంస్థ రుద్రారంలో కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. 562 కోట్ల రూపాయల పెట్టుబడితో TTDI సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీని నెలకొల్పడానికి ఒప్పందం కుదిరింది.
టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో NTT డేటా, నెయిసా నెట్వర్క్స్ ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ AI డేటా సెంటర్ క్లస్టర్ దేశంలోనే అతిపెద్ద AI కంప్యూట్ మౌలిక సదుపాయంగా నిలవనుంది. 25,000 GPUలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన AI సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఇది సమకూరుస్తుంది. తెలంగాణను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్టు ఒక మైలురాయి కానుందని ధిమా వ్యక్తం చేశారు.
ఈ క్లస్టర్కు 500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్తును వినియోగించనున్నారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను ఉపయోగించనున్నారు. అత్యున్నత పర్యావరణ, సామాజిక, పాలన (ESG) ప్రమాణాలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థలతో భాగస్వామ్యం కలిగి AI ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కు ఇది గణనీయంగా దోహదం చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు..












Click it and Unblock the Notifications