కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు రేవంత్ రెడ్డి..
Kumari Aunty: సోషల్ మీడియాలో వైరల్గా మారిన హైదరాబాద్ దాసరి సాయికుమారి అలియాస్ స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ వివాదానికి తెలంగాణ ప్రభుత్వం తెరదించింది. ఆమె ఫుడ్ స్టాల్ను మూసివేసే విషయంలో ఓ అడుగు వెనక్కి వేసింది. ఉన్నచోటే తన ఫుడ్ స్టాల్ను కొనసాగించాలంటూ ఆమె చేసిన విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించింది.
ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కుమారి ఆంటీ.. జీవనోపాధి కోసం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఫుడ్ స్టాల్ ఏర్పాటుచేశారు. ఇటీవలి కాలంలో ఆమె హోటల్కు తాకిడి పెరిగింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు క్రమం తప్పకుండా ఈ హోటల్కు భోజనానికి వెళ్తోన్నారు.

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా అందరికీ సుపరిచితులయ్యారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె హోటల్ వ్యాపారంపై కథనాలను ప్రసారం చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు గుడివాడలో ఇళ్లు కూడా ఇచ్చారంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం.. రాజకీయంగా వివాదాస్పదమైంది.
ఈ ప్రకటన తరువాత.. ఆమె ఫుడ్ స్టాల్పై ట్రాఫిక్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, వెంటనే హోటల్ను తొలగించాలంటూ ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసుల వైఖరిని ఏపీలో అధికారంలో ఉన్న వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తప్పు పట్టింది. జగన్ తనకు ఇళ్లు ఇచ్చారని చెప్పడం వల్ల రేవంత్ రెడ్డే.. ఆమెపై ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది.
ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం దీనికి తెరదించింది. ఈ విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే జోక్యం చేసుకున్నారు. ఫుడ్ స్టాల్ తొలగించాలంటూ జారీ చేసిన ఆదేశాలపై పునఃపరిశీలించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఫుడ్ స్టాల్ స్థలం మార్చాలంటూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న చోటి నుంచే కుమారి ఆంటీ తన వ్యాపారాన్ని కొనసాగించవచ్చని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ను సందర్శిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సాయంత్రం ఆయన అక్కడికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications