కాళేశ్వరం దోషులను కఠినంగా శిక్షిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ వద్ద 20, 21, 22 పియర్స్ ను పరిశీలించారు. అనంతరం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 1975లోనే అంకురార్పణ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాటి సీఎం వైఎస్సార్ రూ. 38, 500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారని.. తెలంగాణ వచ్చేనాటికి ఈ ప్రాజెక్ట్ పై రూ. 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాక కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ పేరు మార్చి అవినీతికి తెరలేపారని అన్నారు. రూ.34 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓ అద్భుతమని అందరినీ భ్రమల్లో ముంచారని.. కానీ కేసీఆర్ అవినీతిని ప్రకృతే బయటపెట్టిందని అన్నారు. అందుకే 2023 అక్టోబర్ లో మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం పేర్కొన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

మేడిగడ్డ పర్యటనను తాను నెల రోజుల ముందే ఖరారు చేసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ బండారం బయటపడుతుందన్న భయంతోనే కేసీఆర్ ఇవాళ సభ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణను అడ్డుకునేందుకే బీఆర్ఎస్ నేతలు దిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయితే కేసును సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని.. ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని మండిపడ్డారు. తాము రెండుసార్లు సీబీఐకి లేఖలు రాసినా కేంద్రం ఎందుకు స్పందించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. కాళేశ్వరం దోషులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications