విద్యా సంస్థల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు, అమ్మాయిల రక్షణ కోసం త్వరలో కొత్త చట్టం
హైదరాబాద్: డ్రగ్స్ స్మగ్లింగ్, వినియోగదారులకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు వేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణంగా ఉంటున్నాయని, వాటిని కట్టడి చేయడం కోసం త్వరలోనే కొత్త చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు.
ఓయూ ఠాగూర్ స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా డ్రగ్స్ దందాలో పాల్గొంటున్నారు. ఈ మేరకు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే కాలేజీలు, పాఠశాలల విద్యార్థులు డ్రగ్స్ కు బానిస అవుతున్నారని చెప్పారు. అందుకే కాలేజీల్లో, స్కూల్స్ లలో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా వాటి బారినపడకుండా చూడవచ్చని అన్నారు.
దేశంలో మాదక ద్రవ్యాల వినియోగించే వారి సంఖ్య 11 కోట్లుగా ఉందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డ్రగ్స్ వినియోగం మరింత పెరుగుతుందన్నారు. విద్యార్థులు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. దశాబ్దం క్రితం ర్యాగింగ్ కు వ్యతిరేకంగా కాలేజీల్లో కమిటీలు వేశామని, కమిటీలతో ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం డ్రగ్స్ నిరోధించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.
ప్రతి విద్యా సంస్థల్లోనూ డ్రగ్స్ వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 5 జోన్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తూర్పు మండలం పరిధిలోని 55 డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఐదుగురికి తగ్గకుండా సభ్యులతో కమిటీలు వేశారు. అందులోని కాలేజీలకు చెందిన ఇద్దరు అధ్యాపకులతోపాటు ముగ్గురు విద్యార్థులుంటారు.