ఇన్ స్పెక్టర్ పట్టించుకోలేదు! : వీసా చీటింగ్, హెచ్ఆర్సీకి మహిళ ఫిర్యాదు
బంజారాహిల్స్ : వీసా మోసాలపై ఫిర్యాదు చేస్తే.. నిందితులతో బేరసారాలు కుదుర్చుకుని కేసును పక్కనబెట్టేశారని ఆరోపిస్తూ బుధవారం నాడు ఓ మహిళ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన మానవ హక్కుల కమిషన్ సదరు ఇన్ స్పెక్టర్ వ్యవహారంపై నివేదికను అందజేయాల్సిందిగా స్థానిక ఏసీపీకి ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. సైనిక్ పురి ప్రాంతంలో నివాసముండే శీభారాణి తాటిపత్రి, డానియల్ లు వీసా ఏజెంట్స్ గా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో ఏసీ గార్డ్స్ ప్రాంతానికి చెందిన ఇర్ఫానా సుభాని దంపతులు లండన్ కు వెళ్లేందుకు గాను తమ కుటుంబ సభ్యులందరికీ వీసాలు ఇప్పించాల్సిందిగా సదరు ఏజెంట్ దంపతులను ఆశ్రయించారు. ఇందుకు గాను మొత్తం రూ.10 లక్షలకు ఇరువురి మధ్య ఒప్పందం జరగ్గా.. ఒప్పందం ప్రకారం రూ.6లక్షలను ఆన్ లైన్ ద్వారా గతేడాది చెల్లించారు ఇర్ఫానా దంపతులు.
అనంతరం హోటల్ ఖర్చులు, ఎయిర్ టికెట్ అంటూ మరో రూ.2లక్షలు డిమాండ్ చేయడంతో.. విడుతల వారిగా ఆ మొత్తాన్ని కూడా చెల్లించారు. అయితే 45 రోజుల్లో వీసా మంజూరు అయ్యేలా చేస్తామని నమ్మించిన సదరు ఏజెంట్స్ ఇంతవరకూ వీసా ఇప్పించలేదు. దీంతో ఇదేంటని నిలదీసిన ఇర్ఫానా దంపతులపై బెదిరింపులకు దిగడం మొదలుపెట్టారు సదరు వీసా ఏజెంట్స్.
ఈ పరిస్థితుల్లోనే సదరు ఏజెంట్స్ వీసా మోసంపై బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే కేసు నమోదు చేసుకున్న ఇన్ స్పెక్టర్ మాత్రం విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు ఇర్ఫానా దంపతులు. సదరు ఇన్ స్పెక్టర్ నిందితులతో బేరసారాలు సాగించడాని ఆరోపిస్తూ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో సెప్టెంబర్ 27వ తేదీ లోగా దీనిపై విచారణ నివేదికను అందజేయాల్సిందిగా బంజారాహిల్స్ ఏసీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి.