హైపర్ ఆది, జబర్దస్త్పై హెచ్చార్సీకి అనాథల ఫిర్యాదు: కత్తి సపోర్ట్, ఇదే కారణం!
Recommended Video
హైదరాబాద్: నటి, వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా, నటుడు నాగబాబు జడ్జీలుగా వ్యవహరిస్తున్న 'జబర్దస్త్' కార్యక్రమంపై హెచార్సీ(మానవ హక్కుల సంఘం) ఫిర్యాదు అందింది. ఈ కామెడీ షోలో అభ్యంతకరంగా వ్యాఖ్యలుంటున్నాయని హైపర్ ఆది, జబర్దస్త్ షోలపై అనాథ పిల్లలు, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ శనివారం హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
జబర్దస్త్, ఆదిపై ఫిర్యాదు
అంతేగాక, హైపర్ ఆది, రోజా, నాగబాబు, అనసూయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు జబర్దస్త్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అనాథ యువతులు ఫిర్యాదు చేశారు. షోలో తమ మనోభావాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జబర్దస్త్ కార్యక్రమంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
బాలలకే కత్తి మద్దతు
బాలల హక్కులు, మానవ హక్కులను నాశనం చేసేలా జబర్దస్త్ లో స్కిట్లు వేస్తుండటం పట్ల కేసు నమోదైందని మహేష్ తెలిపాడు. తన మద్దతు అనాథలకే అని చెప్పాడు.ఈ విషయాన్ని కత్తి మహేష్ ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు.
కత్తి వర్సెస్ ఆది
కాగా, మహేష్ కత్తి, హైపర్ ఆది విషయంలో కొన్ని రోజులుగా భగ్గుమనే వ్యవహారాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి, పదే పదే పవన్పై వ్యంగ్యపు మాటలతో మహేష్ కత్తి దాడి చేయడంతో పవన్ అభిమానులు ఫోన్లతో మహేష్ని విసిగించడం మొదలెట్టారు. పవన్ అభిమానులు ఇలా విసిగిస్తున్నారంటూ మహేష్ కత్తి ఫేస్ బుక్లో పలుమార్లు వీడియోలు పోస్ట్ చేశారు. ఆ తర్వాత మహేష్ కత్తిపై జబర్ధస్త్ స్కిట్లో ముందు పొట్ట, వెనుక బట్ట అంటూ హైపర్ ఆది డైరెక్ట్గానే పంచులు పేల్చాడు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి ఫొటో దిగడం, దీనిని కూడా మహేష్ కత్తి కాంట్రవర్సీకి ఉపయోగించడం వంటి విషయం కూడా తెలిసిందే. ఆ తర్వాత వీరద్దరూ లైవ్ షోలలో కూర్చుని ఒకరినొకరు దూషించుకున్నారు కూడా. అయినా వీరి మధ్య ఇంకా వివాదం కొనసాగుతున్నట్లే తెలుస్తోంది.
ఫిర్యాదు కారణం ఈ వ్యాఖ్యలే
అనాధ బాలలు. తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా స్కిట్ చేశారు అంటూ పూజిత అనే అనాధ హైపర్ ఆదిపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు చేయడానికి కారణం హైపర్ ఆది తన స్కిట్లో ‘అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాథలు' అనే డైలాగ్. స్కిట్లో పెట్టిన ఈ డైలాగ్ బాలల హక్కులు మరియు మానవ హక్కుల ఉల్లంఘనగా తీసుకుని హైపర్ ఆదిపై కఠినచర్యలు తీసుకోవాలి అంటూ అనాధ ఆశ్రమ బాలలు మరియు కత్తి మహేష్ హెచ్ఆర్సిలో ఫిర్యాదు చేశారు. జడ్జీలపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు కోరినట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన పూజిత అనే అనాథ బాలికకు అనేకమంది మద్దతుగా నిలుస్తున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో ఇలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు ఉపయోగించడం ఏంటని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.