ఫోన్ ట్యాపింగ్ కేసులషాక్: చంద్రబాబుపై సిబిఐకి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో చంద్రబాబు నేతృత్వంలోని ఎపి ప్రభుత్వం ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ అరుణ్ కుమార్ అనే న్యాయవాది శుక్రవారంనాడు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా సీబీఐ విచారణ జరిగితే దాన్ని ఏపీ అధికారులు ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు. ఫిర్యాదు ఆధారంగా భవిష్యత్లో కోర్టును ఆశ్రయిస్తానని న్యాయవాది తెలిపారు. పాలనపైనే దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని వివరించారు.
తెలంగాణ సంక్షేమానికి, అభివృద్ధికి, పాలనకు అడ్డుపడే విధంగా చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా వందల కేసులు పెడుతున్నదని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచే కేసుల భాగోతం నడుస్తోందని ఆయన ఆరోపించారు.
నోటుకు ఓటు కేసులో తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు తెలంగాణ ఎసిబికి పట్టుబడిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అందులో పాలు పంచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడినట్లు చెబుతున్న సంభాషణల ఆడియో టేప్ వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే.