తెలంగాణ ఎమ్మెల్యేలలో ఆయోమయం..! నిలువునా ముంచబోతున్న కేసీఆర్ ముందస్తు ప్రకటన..!
తెలంగాణ రాజకీయాల్లో ముందస్తు రాగం శ్రుతి తప్పబోతోంది. ముందస్తు ఎన్నికలు వస్తే సిట్టింగుల అవకాశాలకు పెద్దయెత్తున గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గులాబీ బాస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో పదే పదే నెగటీవ్ రిపోర్ట్ వచ్చిన సిట్టింగులకు సీటు ఇచ్చేది లేదని కఠిన నిర్ణయం తీసుకున్నారట కేసీఆర్. రహస్య సర్వేలో ఎవరి నియోజక వర్గం గురించి ఎలాంటి నివేదిక వచ్చిందో అర్థం కాక గులాబీ ఎమ్మెల్యేలు గుబేలు మంటున్నట్టు సమాచారం. అదీ కాకుండా ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కేసీఆర్ చెప్పడంతో నాయకుల మద్య మరింత అయోమయం పెరిగినట్టు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
తెలంగాణలో ముందస్తు వేడి..! ఎమ్మెల్యేలలో వేగంగా కొట్టుకుంటున్న నాడి..!
ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న సమయానికంటే ముందే ఎన్నికలు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు వేడి మొదలైంది. మిగతా పార్టీల సంగతి పక్కనపెడితే, అధికార పార్టీలో మాత్రం ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్ధుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా వారి ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు సర్వేలు నిర్వహించిన ఆయన.. ఇటీవల తుది జాబితాను నిర్ణయించేందుకు ప్రజా స్పందనపైనే ఆధారపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకోసం గులాబీ బాస్ మరోసారి సర్వే నిర్వహించారని, త్వరలోనే ఫైనల్ లిస్టును రూపొందించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
కొంప ముంచుతున్న సర్వేలు..! ఉత్కంఠగా ఎమ్మ్యెల్యేలు..!
గతంలో నిర్వహించిన సర్వేలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పనితీరు పట్ల అక్కడి ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, దీంతో సదరు ప్రజాప్రతినిధులకు సీఎం వార్నింగ్ ఇచ్చారని తారా స్థాయిలో ప్రచారం జరిగింది. అంతేకాదు, ప్రజల్లో అసంతృప్తి ఉన్న సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ తేల్చేయడం.. ముందుస్తు అని సుఛాయగా తేలడంతో టీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలు హైదరాబాద్కు క్యూ కట్టారు. అంతర్గతంగా జరిపిన సర్వేల నివేదికలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నట్టు తెలుస్తోంది. గులాబీ బాస్ ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కాక ఎమ్మెల్యేలలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయట.
ఎవరి ఫైరవీల్లో వారు..! సీటా..? వేటా... తెలియక తికమక..!
దీనికి తోడు వచ్చే నెలలోనే అభ్యర్ధులను ప్రకటిస్తామని కేసీఆర్ ఇటీవల చెప్పడంతో, ఆ 40 మంది ఎమ్మెల్యేలలో కొందరు టీఆర్ఎస్ భవన్లోనూ, మరికొందరు ప్రగతి భవన్లోనూ ఎక్కువ సమయం గడుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు పార్టీ తరపున టికెట్ ఆశించే వారు స్పీడు పెంచారు. ఆశావహులు మాత్రం అవకాశం రాకపోతుందా అనే ధీమాతో తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసేందుకు ఇప్పటికే పలువురు రాజధాని బాట పట్టారు. వారిలో కొందరు మంత్రులు హరీశ్, కేటీఆర్ను కాకా పడుతుండగా, మరికొందరు గులాబీ బాస్తోనే డీల్స్ మాట్లాడుకుంటున్నారని సమాచారం.
40 కాదు..20 మందే..! ఉద్వాసన తప్పదంటున్న గులాబీ బాస్..!!
ఇలాంటి నేపథ్యంలో ఓ వార్త బయటికి వచ్చింది. కేసీఆర్ ఇటీవల చేసిన సర్వేలో 40 మందిలో కొంతమందికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. ఫలితాలను మెరుగుపరుచుకోని దాదాపు 20 మంది ఎమ్మెల్యేకు ఈ సారి మొండిచేయి చూపాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో టికెట్ ఆశించే వారు మాత్రం తమకు మంచే జరిగిందని అనుకుంటున్నారట, ఇక నుంచి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.