అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి: ఛైర్లో ఉండగానే స్పీకర్కు సుప్రీం నోటీసులు
హైదరాబాద్: జీఎస్టీ బిల్లుపై మంగళవారం తెలంగాణ శాసనసభలో చర్చ జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. జీఎస్టీ బిల్లుపై వివిధ పార్టీల నాయకులు ఒకరి తర్వాత మరొకరుగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు సంపత కుమార్ లేచి స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు.
స్పీకర్ మధుసూదనాచారి వద్దకు వెళ్లి ఆయన చేతిలో ఓ కాగితం పెట్టారు. ఇంతకీ ఆ కాగితం ఏంటంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసు. సాధారణంగా ఇలాంటి నోటీసులను స్పీకర్ ఛాంబర్లో ఆయనకు అందజేస్తారు.
కానీ శాసనసభలో సభ జరుగుతుండగా, స్పీకర్ తన ఛైర్లో ఉండగా స్పీకర్కు సుప్రీం కోర్టు నోటీసులు అందజేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అదే విధంగా పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు కాలే యాదయ్య (చేవెళ్ల) డీఎస్ రెడ్యానాయక్ (డోర్నకల్) జి.విఠల్రెడ్డి (ముధోల్) కోరం కనకయ్య (ఇల్లెందు)లకు కూడా అసెంబ్లీ ఆవరణలోనే స్వయంగా నోటీసులను అందజేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత కుమార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషనను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆగస్టు 17న ఫిరాయింపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్కు, పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు వేర్వేరుగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీం కోర్టు నుంచి నోటీసులను పంపించడంతో పాటు వాటిని స్వయంగా పార్టీ ఫిరాయింపుదారులకు అందించేందుకు పిటిషనర్కు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో శాసనసభ జరుగుతుండగానే సంపత్ కుమార్ ఆ నోటీసులను అందజేయడం విశేషం.
కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే భాస్కర్రావుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపతకుమార్, వంశీచంద్రెడ్డి, ఉత్తమ్ పద్యావతిలతో కూడిన బృందం మంగళవారం శాసనసభ స్పీకర్ మధుసూదనాచారిని ఆయన ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందజేశారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎన్నికైన భాస్కర్రావు తన పదవికి రాజీనామా చేయకుండా అధికార పార్టీ ప్రలోభాలకు గురై పార్టీ ఫిరాయించినందుకు గాను ఫిరాయింపుల చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని అందులో కోరారు.