కేసీఆర్కు మోడీ కంగ్రాట్స్: మోడీ.. కేటీఆర్... ఐదు రాష్ట్రాల ఎన్నికల ట్విట్టర్ హీరోలు వీరే
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి కంగ్రాట్స్, రానున్న అయిదేళ్లు బాగుండాలని విషెస్ తెలిపారు.
రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)
కేసీఆర్కు మోడీ శుభాకాంక్షలు
కేసీఆర్ గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 2014లో సమైక్య ఏపీలో ఎన్నికలు జరిగాయి. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు తెరాస గెలిచి, కేసీఆర్ మొదటిసారి సీఎం అయ్యారు. ఇప్పుడు ముందస్తుకు వెళ్లి రెండోసారి సీఎం అయ్యారు. తెలంగాణ వచ్చాక వరుసగా రెండుసార్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
70 లక్షలకు పైగా ట్వీట్లు
ఇదిలా ఉండగా, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, ఫలితాలు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచే దేశ వ్యాప్తంగా దాదాపు అంతటా ఎన్నికల ముచ్చట్లే. మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎన్నికల హోరు కనిపించింది. ట్విటర్లో ఎన్నికలపై దాదాపు 70 లక్షలకు పైగా ట్వీట్లు రికార్డ్ అయ్యాయి. ఇండియా ఎలక్షన్స్ 2018 హ్యాష్ ట్యాగ్ పేరుతో 70 లక్షలకు పైగా ట్వీట్లు ఉన్నాయి.
లక్షలాది ట్వీట్లు
ఎన్నికలలో నాయకుల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఎక్కువ పేరు వచ్చింది ప్రధాని నరేంద్ర మోడీది. తెలంగాణ విషయానికి వస్తే కేటీఆర్ పేరు. అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు #IndiaElections2018 హాష్ ట్యాగ్తో ఈ డెబ్బై లక్షల ట్వీట్లు నమోదయ్యాయి. ఇందులో ప్రచారం, ఎన్నికలు, ఓట్లు, ఫలితాలు తదితర ట్వీట్లు ఉన్నాయి. ఫలితాల రోజున 4 లక్షల ట్వీట్లు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా టాప్ 5 వీరే
అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువగా మార్మోగిన పేరు నరేంద్ర మోడీది. ఆ తర్వాత ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రెండో స్థానంలో, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మూడో స్థానంలో, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాలుగో స్థానంలో, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అయిదో స్థానంలో ఉన్నారు.
తెలంగాణలో టాప్ 4 వీరే
తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే కేటీఆర్ తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత వరుసగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు. ఆయా రాష్ట్రాలవారీగా చూస్తే రాజస్థాన్లో వరుసగా వసుంధరా రాజే, సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాధిత్య సింధియా, కమల్ నాథ్, అర్చనా చిత్రీస్, ఛత్తీస్గడ్లో రమణ్ సింగ్, భూపేష్ భగేల్, అజిత్ జోగిల పేర్లు ఉన్నాయి.