Errabelli Dayakar Rao: జాతీయ మహిళా కమిషన్కు ఎర్రబెల్లిపై ఫిర్యాదు-మంత్రి రియాక్షన్ ఇదే
వరంగల్ అర్బన్ జిల్లాలోని ఉప్పల్ గ్రామ పర్యటనలో స్థానిక మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎంపీడీవో హోదాలో ఉన్న అధికారిణి పట్ల మంత్రి ఎర్రబెల్లి అందరి ముందే అనుచితంగా మాట్లాడారు. 'మేడమ్.. నువ్వు బాగానే ఊపుతున్నావ్... కానీ ఈడ ఊప్తలెవ్...' అంటూ అసభ్య కామెంట్స్ చేశారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలకు అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు.
మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.బాధ్యాతయుతమైన మంత్రి హోదాలో ఉండి ఒక అధికారిణిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికారులంటే ఇంత చులకన భావమా అని నిలదీస్తున్నారు. ఈ వివాదాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళా అధికారిపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు చేశారని కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను అందులో పేర్కొన్నారు. ఎర్రబెల్లిని వారించాల్సింది పోయి అక్కడున్నవారంతా నవ్వారని... ఒకరకంగా ఇది మహాభారతంలో ద్రౌపదిని అవమానించిన ఘటనలా ఉందని అభివర్ణించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు ఆయన వ్యాఖ్యలకు పగలబడి నవ్వినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు మంత్రి ఎర్రబెల్లి వాదన మరోలా ఉంది. దురుద్దేశంతోనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఎర్రబెల్లి అన్నారు. ఉద్యోగులు,అధికారులపై తనకు గౌరవం ఉందని తెలిపారు. ఆ మహిళా ఎంపీడీవోతో తనకు పరిచయం ఉందని... ఒక కూతురిలా ఆమెను పలకరిస్తానని చెప్పారు. శుక్రవారం(జులై 9) ఉప్పల్లో జరిగిన గ్రామ ప్రగతి సభకు హాజరైనప్పుడు కూడా 'కూతురు... బాగున్నావా...' అంటూ ఆమెను పలకరించానని చెప్పారు. అక్కడున్నవారు కూడా తన మాటలు విన్నారని తెలిపారు.
గతంలో ఆ అధికారిణి దుగ్గండి మండలంలో పనిచేశారని... అక్కడ పనిచేసినప్పుడు ఉద్యోగులను ఉరుకులు పరుగులు పెట్టించి పనులు చేయించారని అన్నారు. అక్కడ బాగా పనిచేశావని... ఇక్కడెందుకు పనిచేయట్లేదని అడిగానన్నారు. కానీ ఆ వ్యాఖ్యలను కట్ చేసి మిగతా వ్యాఖ్యలను మాత్రమే వీడియోలో చూపిస్తున్నారని... వాటినే వైరల్ చేస్తున్నారని పేర్కొన్నారు. తానంటే గిట్టనివాళ్లే తనపై బురదజల్లేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఆ మహిళా ఎంపీడీవో అధికారి మాత్రం ఎర్రబెల్లి వ్యాఖ్యలపై ఇప్పటివరకూ స్పందించలేదు.
మంత్రి ఎర్రబెల్లి గతంలోనూ అధికారులపై చులకన వ్యాఖ్యలు చేశారన్న విమర్శలున్నాయి. గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో... 'కలెక్టర్ గారు కుర్చీలు వేయించండి...' అంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక ఐఏఎస్ అధికారి పట్ల మంత్రికి ఇంత చులకన భావమా అని చాలామంది ప్రశ్నించారు. తాజాగా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు.
Recommended Video
Complaint to @NCWIndia on @TelanganaCMO Minister @DayakarRao2019 for humiliating Woman officer MPDO Pallavi in Grama Sabha at Kamalapur, warangal.https://t.co/iXTJYLORrc. @INCIndia @MahilaCongress @TelanganaPMC @sushmitadevinc @manickamtagore @revanth_anumula @CilarapuDamodar pic.twitter.com/t1d2WaukKZ
— judson bakka, బక్క జడ్సన్ - Wear Mask (@zson_bakka) July 9, 2021