బండి సంజయ్ తో రాజ గోపాల్ భేటీ - వేటుకు రంగం సిద్దం : రేవంత్ కొత్త స్కెచ్..!!
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు వ్యవహారంలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయన బీజేపీలో చేరటానికి దాదాపుగా ముహూర్తం ఖరారైంది. ఆయన పార్టీలోకి రాకను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్దారించారు. ఇదే సమయంలో..రాజగోపాల్ సైతం తన నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు..అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తనను కాంగ్రెస్ అవమానించిందని.. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే బీజేపీతోనే సాధ్యమంటూ చెప్పుకొచ్చారు. తన రాజీనామా పైన నియోజకవర్గ ప్రజల ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.

రాజగోపాల్ పై బహిష్కరణ వేటు
ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా రాజగోపాల్ పైన ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దాని పైన యాక్షన్ ప్లాన్ సిద్దం చేసారు. బీజేపీలోకి వెళ్లటం ఖాయం కావటంతో రాజగోపాల్ రెడ్డి పైన బహిష్కరణ వేటు దిశగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియాను ఈడీ విచారిస్తున్న వేళ.. పార్టీ శ్రేణులంతా ఆందోళన వ్యక్తం చేస్తుంటే..పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ చేసిన వ్యాఖ్యలను హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు సమావేశమై రాజగోపాల్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.

బండి సంజయ్ తో రాజగోపాల్ సమావేశం
రాజగోపాల్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకొని కేడర్ కు గట్టి సంకేలతాలు పంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాజగోపాల్ పైన వేటు..నియోజకవర్గంలో పార్టీ బలోపేతం పైన వెంటనే చర్యలు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. రాజగోపాల్రెడ్డి తీరును ఎండగట్టేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక కేడర్ను ఆదేశించారు. ఇందు లో భాగంగానే.. కేడర్కు భరోసా కల్పించేందుకు 50వేల మందితో బహిరంగ సభ నిర్వహించాలని ఢిల్లీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇటు హైదరాబాద్ కేంద్రంగా రాజగోపాల్ రెడ్డి తన కార్యాచరణ వేగవంతం చేసారు. బుధవారం రాత్రి ఒక ఫాం హౌస్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆయన సమావేశం అయినట్లు విశ్వసనీయ సమాచారం. సాయంత్రమే బండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి ఫోన్ మంతనాలు జరిపారు. ఆ తరువాత ఇద్దరు కలిసినట్లు తెలుస్తోంది.

మునుగోడులో కాంగ్రెస్ సభ
బండి సంజయ్ స్వయంగా పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి చేరిక ఖాయమని చెప్పటంతో..ఇక, దీని పైన అనుమానాలు తొలిగిపోయాయి. కాంగ్రెస్ వేటు వేసే దాకా వేచి చూడటమా.. లేక, ముందుగానే స్పీకర్ ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటమా అనే అంశం పైన రాజగోపాల్ రెడ్డి తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. రేపు రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఆ పర్యటన సమయంలో రాజీనామా..భవిష్యత్ కార్యాచరణ పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఇక, రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించి..బీజేపీ ఉప ఎన్నికల సవాల్ ను స్వీకరించేందుకు సిద్దంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.

రేవంత్ కొత్త స్కెచ్ ..సోదరుడు అంగీకరించేనా
మునుగోడు ఉప ఎన్నికకు ముందే రేవంత్ అక్కడ అభ్యర్ధిని ఎంపిక విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు. రాజగోపాల్ రెడ్డి పైన పార్టీ అభ్యర్ధిగా ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బరిలోకి దించాలనే ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా తనకు పీసీసీ వచ్చిన సమయం నుంచి ఆ తరువాత వ్యతిరేకించిన కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఇప్పుడు ఇరకాటంలో పెట్టటంతో పాటుగా.. వెంకటరెడ్డి బరిలో నిలిస్తేనే రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టగలుగుతామని చెబుతున్నట్లుగా సమాచారం. అయితే, సోదరుడి మీద పోటీకి వెంకటరెడ్డి సిద్దమవుతారా లేదా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications