వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే, కేసీఆర్ సర్కార్ అబద్దపు ప్రచారాలు: ఉత్తమ్ కుమార్
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం భీమారంలో జరిగిన ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వరంగల్: కేసీఆర్ సర్కారు అబద్ధపు ప్రచారాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్కే దక్కుతుందని జోస్యం చెప్పారు.
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం భీమారంలో జరిగిన ఇందిరమ్మ రైతు బాట కార్యక్రమంలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే జీవో 39ను తీసుకొచ్చారని ఆరోపించారు. ఎక్కడికక్కడ రైతు సంరక్షణ సమితులను ఏర్పాటు చేసి.. రైతు సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
భూమి ఉన్న రైతులకే కాకుండా.. పనిచేసే ప్రతి రైతుకూ రూ.4వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక బతుకమ్మ చీరల గురించి ప్రస్తావిస్తూ.. నాసిరకం చీరలిచ్చి తెలంగాణ మహిళలను అవమానించారన్నారు. తక్షణమే వాటి స్థానంలో రూ.500లతో నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నాసిరకం పనులు వల్ల 8 మంది మృత్యువాత పడ్డారని ఉత్తమ్ అన్నారు. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 'ఇందిరమ్మ రైతుబాట' పూర్తిగా విజయవంతం అయ్యిందన్నారు. టీఆర్ఎస్ పాలనపై రాజీ లేని పోరాటం చేస్తామని తెలిపారు.
ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామిని కేసీఆర్ నిలబెట్టుకోలేదని అన్నారు. దేన్ని తప్పుపట్టినా కాంగ్రెస్ కుట్ర అనడం టీఆర్ఎస్ వాళ్లకు అలవాటైందన్నారు. కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీలను నిర్మించి ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తారని ప్రశ్నించారు.