పెట్రోల్,డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా!కేంద్రం దిగొచ్చేంత వరకూ పోరాటం ఆగదన్న ఉత్తమ్.!
హైదరాబాద్ : కరోనో మహమ్మారితో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అడ్డగోలుగా పెరుగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం 11వ తేదీన ఉదయం పదకొండు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
Recommended Video
కేంద్ర ప్రభుత్వ బహిరంగ దోపిడీ.. ఐదు నెలల్లో పెట్రోల్ ధరలను 43సార్లు పెంచిన బీజేపి ప్రభుత్వం..
తెలంగాణలోని డీసీసీ అధ్యక్షులు జిల్లా కేంద్రాలల్లోనూ, నియోజక వర్గ కేంద్రాలలో నియోజక వర్గాలకు బాద్యత వహించాలని, మండల, పట్టణ కేంద్రాలలో ఆయా నాయకులు తప్పకుండా ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయల మార్కును దాటిందని, ఈ పెరుగుదల వల్ల అన్ని గృహావసరాలు మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు.. పెట్రోల్,డీజిల్ రేట్లు తగ్గించే వరకూ పోరాటం ఆపొద్దన్న కాంగ్రెస్..
గత 13 నెలల్లో, పెట్రోల్ పై లీటర్ కు 25.72 రూపాయలు, డీజిల్ పై లీటరుకు 23.93 రూపాయలు పెరిగాయని, ఈ ఐదు నెలల్లో 43 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా దోపిడీకి ఇది ఒక ఉదాహరణ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ బహిరంగ దోపిడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్ పంపుల ముందు రేపు జూన్ 11, శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు జారీ చేసారు.
కోవిడ్ నిబంధనలకు లోబడే నిరసనలు.. కేంద్రం దిగొచ్చేంత వరకూ ఉద్యమం చేయాలన్న ఉత్తమ్..
ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక మందగమనం, విపరీతమైన నిరుద్యోగం, వేతనాలలో కోత, ఉద్యోగ నష్టాలు మరియు అధిక ధరల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని, ఈ ప్రజా వ్యతిరేక అంశాలపై కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం పోరాటం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమాలలో సీనియర్ నాయకులు, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, ఆయా జిల్లాల్లోని పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఉత్తమ్ సూచించారు. ఈ కార్యక్రమాలన్నీ అధికారులు నిర్దేశించిన కోవిడ్ -19 ప్రోటోకాల్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, మాస్కలు ధరించి, సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
ముఖ్య నాయకులు పాల్గొనే ప్రాంతాలు.. అందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వ మెడలు వంచాలన్న ఉత్తమ్..
శుక్రవారం ముఖ్య నాయకులు పాల్గొనే నిరసన కార్యక్రమాల ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి. 1.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు నాంపల్లి హైదరాబాద్, 2. భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత ఖమ్మం, డీసీసీ ఆఫీసు వద్ద పెట్రోల్ బంకు. 3. జీవన్ రెడ్డి, ఎమ్యెల్యే, జగిత్యాల. 4.రేవంత్ రెడ్డి ఎంపీ, వర్కింగ్ ప్రసిడెంట్, ఘట్కేసర్ వద్ద పెట్రోల్ బంకు, వందన హోటల్ ఎదురుగా. 5.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ, భువనగిరి. 6. పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రసిడెంట్, మాజీ ఎం.పీ కరీంనగర్. 7.కుసుమ కుమార్, వర్కింగ్ ప్రసిడెంట్, సంగారెడ్డి. 8.జగ్గారెడ్డి ఎమ్యెల్యే, సంగారెడ్డి. 9.వంశీచంద్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి, కల్వకుర్తి. 10. సంపత్ కుమార్ ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్. 11. శ్రీధర్ బాబు ఎమ్యెల్యే, మంథని. 12. పొడెం వీరయ్య డీసీసీ అధ్యక్షులు,ఎమ్యెల్యే భద్రాచలం. 13.షబ్బీర్ అలీ, మాజీ మండలి ప్రతిపక్ష నేత కామారెడ్డి. 14. మధు యాష్కీ. మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి హైదరాబాద్. 15..పొన్నాల లక్ష్మయ్య, మాజీ పీసీసీ అధ్యక్షులు హైదరాబాద్ లో పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు.