లింగోజిగూడా స్థానం కాంగ్రెస్ ఖాతాలో.. సిట్టింగ్ స్థానం పోగొట్టుకున్న బీజేపీకి షాక్ !!
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ తో పాటుగా సిద్ధిపేట, అచ్చంపేట, జడ్చర్ల ,నకిరేకల్, కొత్తూరు పురపాలక సంఘాలతో పాటు జిహెచ్ఎంసి లోని లింగోజిగూడ, మరో నాలుగు మునిసిపాలిటీల్లో నాలుగు వార్డులకు నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే దాదాపు అన్ని చోట్లా టీఆర్ఎస్ హవా కొనసాగుతుంటే, గ్రేటర్ హైదరాబాద్ లింగోజీగూడాలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లింగోజిగూడ డివిజన్ పరిధిలో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్ ఇచ్చింది కాంగ్రెస్. గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన బిజెపి అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణం చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.అయితే బిజెపి ముఖ్య నేతలు ఇక్కడ నుండి పోటీ పెట్టొద్దని మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేయడంతో టిఆర్ఎస్ తరఫున ఎవరిని బరిలోకి దింపలేదు. దీంతో మళ్లీ సిట్టింగ్ సీటు దక్కించుకోవాలనుకొన్న బిజెపికి కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది.
లింగోజిగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి బిజెపి నుండి బరిలోకి దిగిన అభ్యర్థి మందుగుల అఖిల్ పవన్ గౌడ్ పై విజయం సాధించారు. ఇక ఈ తాజా విజయంతో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరుకుంది . బిజెపి నాయకులు,అటు టిఆర్ఎస్ ని నిలువరించి సీటు దక్కించుకుంటారు అనుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానాన్ని కట్టబెట్టారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు తాము పోటీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని మాట్లాడుకుంటున్నారు.