అడ్రస్ లేని కాంగ్రెస్.. కేడర్ లేని బీజేపీ, మాది బోగస్ సర్వే అయితే బీజేపీది?: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదని, బీజేపీ కేడర్ లేక సతమతం అవుతోందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. తమ సర్వే బోగస్ అయినప్పుడు బీజేపీ సర్వే కూడా బోగసేనన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేదని, బీజేపీ కేడర్ లేక సతమతం అవుతోందని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, డీసీ మాజీ అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్రావులు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని భావించి పార్టీలో చేరిన వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నామన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్కు తిరుగు లేదని, అభివృద్ధిలో ఆదిలాబాద్ దూసుకుపోతోందని కేసీఆర్ పేర్కొన్నారు. ఖానాపూర్ విషయంలో ఎవ్వరూ కన్ఫ్యూజన్ అవాల్సిన అవసరం లేదని, రమేష్ రాథోడ్ను పార్టీ సముచితంగా గౌరవిస్తుందని ఆయన చెప్పారు.
ఉద్యమ సమయంలో తానేం చెప్పానో అది ఇప్పుడు నూటికి నూరు శాతం నిజమవుతోందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండటం చరిత్రాత్మకమన్నారు. కొన్ని పార్టీలు ఏం చేయాలో అర్థంకాక అవాకులు చెవాకులు పేలుతున్నాయని విమర్శించారు.
టీఆర్ఎస్ సర్వే బోగస్ కాదు.. ప్రతిపక్షాల దమాకులు బోగస్ అన్నారు. తమ సర్వే బోగస్ అయినప్పుడు బీజేపీ సర్వే కూడా బోగసేనన్నారు. వాస్తవాలను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని ఆయన దుయ్యబట్టారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 80 సీట్లకు పైగా గెలుస్తామని సర్వేలో తేలిందని, అందరి అంచనాలు తారుమారు చేసి జీహెచ్ఎంసీలో 99 సీట్లు గెలిచామని, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.