ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ఏఐసీసీ పిలుపు : ఏం జరుగుతోంది..!!
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలను వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ అధినాయకత్వం ఆహ్వానించింది. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు వీరిని ఢిల్లీకి పిలిపించటం ఆసక్తి కరంగా మారుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ నాలుగు సార్లు ఈడీ ముందు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సుదీర్ఘ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో రాహుల్ ను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ కొనసాగిస్తున్నారు. సీడబ్ల్యూసీ నేతలతో పాటుగా ఎంపీలు సైతం నిరసనల్లో పాల్గొంటున్నారు.
అన్ని రాష్ట్రాల్లోనూ పీసీసీల ఆధ్వర్యం లో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రియాంక సైతం ఇందులో పాల్గొంటున్నారు. ఇక, ఈ నెల 23న కాంగ్రెస్ చీఫ్ సోనియా ఈడీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలోనే హజరవ్వాల్సి ఉండగా..కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే, ఈ రోజు సాయంత్రమే సోనియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో 23న హాజరు అవుతారా లేదా అనేది సందేహమే. ఇక, అగ్నిపథ్ విషయంలోనూ వెనక్కు తగ్గేది లేదంటూ కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. కాంగ్రెస్ దీని పైన నిరసనలు కొనసాగిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ఎంపీలు ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఇక.. పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలను సైతం రేపు ఢిల్లీకి రావాలంటూ పీసీసీ చీఫ్ ల ద్వారా సందేశాలు పంపారు.

ఢిల్లీలోనే ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్.. సీఎల్పీ నేత భట్టి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు ఫోన్ చేసారు. రేపు ఉదయం ఢిల్లీకి రావాలంటూ సూచించారు. దీంతో.. రేపు ఉదయం వీరంతా ఢిల్లీకి బయల్దేరనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీకి చేరుతుండటంతో పార్టీ అధినాయకత్వం ఆలోచనలు ఏంటనేది అంతు చిక్కటం లేదు. భారీ స్థాయిలో నిరసనకు సిద్దం అవుతుందా.. లేక, ఇందులో నిరసనలో భాగంగా.. రాష్ట్రపతి ఎన్నికల వేళ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలతో కలిపి సంచలన నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇప్పుడు ఈ విషయం కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications