కాంగ్రెస్లోకి పొంగులేటి, జూపల్లి; అధిష్టానం గ్రీన్ సిగ్నల్; చేరికకు ముహూర్తం ఫిక్స్!!
బీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ పార్టీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. గత కొంత కాలం నుండి ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీలో చేరుతారు అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో జూపల్లి కృష్ణారావు రాజకీయాలను శాసించగలిగిన కీలక నేతలు. అంగబలం, అర్థబలం ఉన్నవీరు ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి వచ్చే ఎన్నికలలో లబ్ధి జరుగుతుందని రాజకీయ వర్గాలు భావించాయి. అటు పొంగులేటిని, జూపల్లిని తమ పార్టీలో చేర్చుకోవాలని స్వయంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు వారి వద్దకు వెళ్లి మరీ మంతనాలు జరిపారు. సాదరంగా ఆహ్వానించారు.

అయినప్పటికీ స్థానిక రాజకీయాలు, స్థానిక రాజకీయాలపై ఏ పార్టీల ప్రభావం ఏవిధంగా ఉంది? ఏ పార్టీలో చేరితే తమకు లబ్ధి జరుగుతుంది? వంటి అంశాలను బేరీజు వేసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి ఇంకా క్షేత్రస్థాయిలో బలమైన పట్టు ఉన్న కారణంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వారు పార్టీలో చేరికకు ఆ పార్టీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో హైకమాండ్ చర్చలు జరిపి, కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో ఇద్దరు నేతలను పార్టీలో చేర్చుకోవాలని ఈ చేరికల కార్యక్రమం ద్వారా పార్టీ మారాలని ఆలోచిస్తున్న వారికి కాంగ్రెస్ గురించి ఆలోచించేలా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెసు అగ్రనేతల సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
ఈ మేరకు తమ అభిమానులకు, తమ అనుయాయులకు ఇద్దరు నేతలు సంకేతాలిచ్చారు. ఎట్టకేలకు అనేక చర్చోప చర్చల మధ్య సొంత గూటికి ఇద్దరు నేతలు చేరనున్నారు. అయితే వీరిద్దరి చేరిక ఈ నెలలోనే జరగనుందని తెలుస్తున్నప్పటికీ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఇరువురు నేతలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు.
దీనికి సంబంధించి ఈ నెల 12వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ లతో సమావేశం కానున్నారు. రాహుల్ గాంధీ అమెరికా పర్యటన తర్వాత ఖమ్మం సభ పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 20వ తేదీ కానీ 25వ తేదీన కానీ ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలు 12వ తేదీ తర్వాత వీరి చేరికకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications