కాంగ్రెస్ పంచాయితీ మళ్ళీ మొదటికే.. సయోధ్య పార్ట్ 2లో వచ్చేదెవరు? హస్తంనేతల్లో చర్చ!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లో చోటుచేసుకున్న అంతర్గత యుద్ధం కొనసాగే అవకాశం కనిపిస్తుందా? ఏకంగా ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ వచ్చి నేతలతో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదా? మళ్లీ కాంగ్రెస్ పార్టీలో తుఫాను కొనసాగే అవకాశం ఉందా? సయోధ్య పార్ట్ 2 కొనసాగుతుందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
తెలంగాణా కాంగ్రెస్ పంచాయితీ .. దిగ్విజయ్ సింగ్ చేసిందిదే
కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య చోటుచేసుకున్న వివాదం పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. పాత, కొత్త నేతలతో మంతనాలు జరిపారు. సీనియర్లు జూనియర్లు ఎవరి వాదన వారు వినిపించారు. రేవంత్ వర్గం రేవంత్ వ్యతిరేక వర్గం తమదైన శైలిలో రాష్ట్రంలో పరిస్థితులను గురించి దిగ్విజయ్ సింగ్ కు వివరించి చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినదంతా విన్న దిగ్విజయ్ సింగ్ టిపిసిసి అధ్యక్షుడిని మార్చే అంశం తన పరిధిలోనిది కాదని పేర్కొన్నారు. సీనియర్లు జూనియర్లు అందరూ కలిసి పని చేయాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సూచించారు.
కరవమంటే కప్పకు కోపం .. విడవమంటే పాముకు కోపం.. దిగ్విజయ్ అర్ధం చేసుకుంది ఇదే
పార్టీలో ఉన్న నాయకులు అందరూ కలిసికట్టుగా లేకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని, కలిసి ఉంటే కలదు సుఖం లేదంటే మీ ఇష్టం అంటూ చెప్పి దిగ్విజయ్ సింగ్ ఈ పంచాయితీ నా వల్ల కాదు అని వెళ్లిపోయారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినదంతా విన్న దిగ్విజయ్ సింగ్ ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ పరిస్థితిని విని షాకయ్యారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని ఓ నివేదికగా దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలోని అధిష్టానానికి అందిస్తారని తెలుస్తుంది.
వారిని మార్చాలని పట్టు పట్టిన సీనియర్లు.. పంచాయితీ తెల్చలేకపోయిన ట్రబుల్ షూటర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని, ఆయనకు వత్తాసు పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ ను మార్చాలని సీనియర్ నాయకులు అందరూ పట్టుబట్టారని తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జరిగిన ఎన్నికలలో ఓటమి పాలై పరువు పోగొట్టుకోవడానికి వారిద్దరే కారణమని చెప్పి, వారితో కలిసి పని చేయలేమని సీనియర్ నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక దీంతో ఈ సమస్యను పరిష్కరించలేనని భావించిన దిగ్విజయ్ సింగ్ నాలుగు మంచి మాటలు చెప్పి, కలిసికట్టుగా పని చేసుకోవాలని సూచించి, సీనియర్లు జూనియర్లు అన్న తేడా లేదు పనిచేయడమే ప్రాధాన్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలకు అందరికీ కలిపి క్లాస్ పీకారు.
కాంగ్రెస్ లో గొడవ టీ కప్పులో తుఫాను అని చెప్పే ప్రయత్నం చేసిన డిగ్గీ రాజా
ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు కాబట్టి అధికార బి ఆర్ ఎస్ పార్టీని, కేంద్రంలోని బిజెపిని కాసేపు తిట్టిపోశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తుంది అని చెప్పుకొచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించి, ఇప్పటికైనా అందరూ మారతారని విశ్వాసాన్ని వ్యక్తం చేసి వెళ్ళిపోయారు. అంతర్గత విబేధాలు ఉన్నా రచ్చకెక్కొద్దు అని హితవు పలికారు. కాంగ్రెస్ లో గొడవ టీ కప్పులో తుఫాను అని చెప్పే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ నేతల సయోధ్యకు నెక్స్ట్ వచ్చేవారెవరు ?
అయితే రేవంత్ రెడ్డి విషయంలో, మాణిక్కం ఠాగూర్ విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు అభిప్రాయం మారే పరిస్థితి లేదన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. మరి ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ కే ట్రబుల్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ముందు ముందు ఏం చేయబోతున్నారు? వీరిని బుజ్జగించడానికి కాంగ్రెస్ అధిష్టానం నుండి నెక్స్ట్ ఎవరు రంగంలోకి దిగబోతున్నారు? తెలంగాణా కాంగ్రెస్ సమస్య పరిష్కారానికి నెక్స్ట్ ప్రియాంకా గాంధీ వస్తారేమో అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అసలు తెలంగాణ కాంగ్రెస్ లో గొడవలు సర్దుకునే అవకాశం ఉందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.