'సీఎం కేసీఆర్ దృష్టంతా ఫాంహౌస్పైనే, రైతులపై కాదు'
హైదరాబాద్: రైతుల సమస్యలను గాలికి వదిలేసి, సొంత ఫాంహౌస్లో పంటల సాగుపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై శనివారం ఆయన మీడియాలో తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.
వర్షాకాలం వచ్చినా రైతులకు కావాల్సిన పెట్టుబడులు, ఎరువులు లాంటి సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒకే విడతలో రుణాలు చెల్లించి... రైతులకు కొత్త రుణాలు అందేలా చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణను ధనిక రాష్ట్రమని చెప్తున్న సీఎం కేసీఆర్... రైతులకు బకాయిలు చెల్లించకపోవడం అత్యంత దారుణమని అన్నారు. ఉద్యానవన ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి ఇంకా వాటిని చెల్లించకపోవడం సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందన్నారు.