కేసీఆర్పై అలీ ఫైర్, బీజేపీ ఆగట్లేదు: కేటీఆర్,రాహుల్పై
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇద్దరు చంద్రులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు చేసుకుంటున్నారని మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఆరోపణలు గుప్పించుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్య చేశారు. అవినీతిని సహించనని చెబుతున్న కేసీఆర్ తన అవినీతి గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
అహంకారంతో పాలిస్తున్నారని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. ఏది అడిగినా ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. పింఛన్లు అడిగితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇది అహంకారపూరిత పాలన అన్నారు.
రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేయడం విడ్డూరమన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. విమలక్క పైన కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఇలాంటి నియంతలు చాలామంది చరిత్రలో కలిసిపోయారని విమర్శించారు.
ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తారనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సాగునీరు ఇవ్వాలన్న రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక, కుట్రపూరిత పాలన సాగుతోందన్నారు.
కాంగ్రెస్, బీజేపీలను కడిగేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పైన నిప్పులు చెరిగారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్సీ సీటుతోనే ఆగడం లేదని ఎద్దేవా చేశారు. పది నెలల్లో అద్భుతాలు సృష్టించాలంటే కుదరని పని అని చెప్పారు. గతంలో కంటే హైదరాబాదులో క్రైం రేటు తగ్గిందన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాము రాహుల్ గాంధీలా ప్రజాక్షేత్రాన్ని వదిలేసి పారిపోలేదన్నారు. వాటర్ గ్రిడ్ పథకం పైన ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ వాళ్లు.. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే కమీషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న జానారెడ్డి ముడుపులు తీసుకున్నారా అని ప్రశ్నించారు.
ఈ దేశానికి పట్టిన శని కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తెరాస పైన డిగ్గీ చేసిన ఆరోపణలు అసత్యాలన్నారు. అరవై ఏళ్ల స్వతంత్ర దేశ చరిత్రంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా తాము వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.
ఇది బృహత్తర కార్యక్రమమని చెప్పారు. పైపుల పరిశ్రమ కోసం వాటర్ గ్రిడ్ చేపట్టారని చెప్పడం డిగ్గీకి సరికాదన్నారు. ప్రజలకు నీళ్లు ఇచ్చే మార్గం మరొకటి ఏమైనా డిగ్గీ కనుక్కున్నారా అని ప్రశ్నించారు. కుంభకోణాలు, కమీషన్ల సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే అన్నారు.