తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ వికెట్: కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా..బీజేపీలోకా..షర్మిలా పార్టీ వైపా..?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో మరో బిగ్ వికెట్ పడింది. శాసన మండలి ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే.. కీలక నాయకుడొకరు పార్టీకి గుడ్బై చెప్పినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారనే ప్రచారం సాగుతోంది. త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరుతారని సమాచారం. దీనికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ ఆయన ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనే- లోక్సభ మాజీ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?
నైతికి విజయం బీజేపీ-జనసేనదే: రూటు మార్చిన యామిని: ఈ సారి టీడీపీపై ఫైర్: ఆ ఆశ బలంగా
Recommended Video
టీఆర్ఎస్తో ఆరంభం..
కాంగ్రెస్కు ఆయన రాజీనామా చేయడానికి కారణాలేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరానప్పటికీ.. పార్టీ అనుసరిస్తోన్న విధి విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. నిజానికి- కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం తెలంగాణ రాష్ట్ర సమితితో ఆరంభమైంది. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్లో చేరారు. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. 70 వేలకు ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని ఓడించారు. టీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఎదిగారు.
టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు..
ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్కు దూరం అయ్యారు. కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. 2019 నాటి సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. విజయాన్ని అందుకోలేకపోయారు. 14 వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కొంత కాలం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ.. తరచూ పార్టీ సమావేశాలకు హాజరయ్యే వారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం..
తాజాగా- హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి జీ చిన్నారెడ్డి విజయం కోసం కృషి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజే.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ను వీడాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాని ప్రభావం చిన్నారెడ్డి గెలుపోటములపై పడకూడదనే కారణంతోనే పోలింగ్ ముగిసేంత వరకూ వేచి ఉన్నారనే ప్రచారం ఉంది.
ప్రత్యామ్నాయంగా బీజేపీ లేదా షర్మిలా పార్టీ వైపు..
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని సమాచారం. ఈమేరకు ఆయన చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో వైయస్ షర్మిలా కొత్త పార్టీ పెడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వైపు కూడా ఆయన చూస్తున్నట్లు సమాచారం. ఒకే సామాజిక వర్గం కావడంతో వైయస్ షర్మిలా పార్టీలో కూడా ఆయన చేరే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్కు కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు రాజీనామా చేశారో అనే అంశంపై పూర్తి క్లారిటీ రాలేదు. పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు, టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఎదగలేకపోవడం అనే అంశాలపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో కూడా మనస్పర్థలు రావడంతోనే కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ను వీడాలని భావిస్తున్నట్లు సమాచారం.