కేసీఆర్, మోడీ మధ్యలో అదానీ: బీజేపీతో పొత్తంటూ రేవంత్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు, సంచలన ఆరోపణలు చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికలతో కేసీఆర్కు మోదీకి మధ్య ఉన్న చీకటి సంబంధం బయటపడిందని ఆరోపించారు.కేసీఆర్ ఒక చేతిలో మజ్లీస్, మరో చేతిలో బీజేపీని పట్టుకుని తిరుగుతున్నాడని రేవంత్ మిమర్శించారు.
Recommended Video
బీజేపీతో కలిసి టీఆర్ఎస్ పోటీ..
రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీయే, యూపీయే మధ్య పోటీ జరిగితే కేసీఆర్ ఎన్డీయేకు మద్దతుకు ఇచ్చారని, దీంతో మోడీకి ఆయనకి మధ్య ఉన్నచీకటి అనుబంధం ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని రేవంత్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీతో పొత్తు దిశగా వెళ్తోందని ఆరోపించారు.
మోడీ, కేసీఆర్ మధ్యలో అదానీ..
మోడీకి, కేసీఆర్కి చీకట్లో ఉన్న వ్యక్తి ఎవరో కూడా బుధవారం తమిళనాడు పర్యటనలో తేలిపోయిందన్నారు. కేసీఆర్ గుజరాత్కు చెందిన అదానీ గ్రూప్ అధినేత, పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదాని సొంత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లాడని, మోడీకి కేసీఆర్కు మధ్య అదానీ కీలకంగా వ్యవహరిస్తున్నాడని సంచలన ఆరోపించారు.
విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి
అంతేగాక, ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలులో అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. మార్వా విద్యుత్ కంపనీకి అదానీ బొగ్గు సరఫరా చేస్తున్నారని, అందుకే అధిక ధరలకు కేసీఆర్ విద్యుత్ కొనుగోలు చేశారని అన్నారు. అదానీ కంపనీకి ఆర్ధిక ఇబ్బందులు తొలగడం కోసం కేసీఆర్ అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు వేల కోట్లు పెంచుకోవడం కోసం విద్యుత్ సంస్థల మీద ఆర్ధిక భారం పెంచుతున్నారని ఆరోపించారు.
రాహుల్ను అడ్డుకునేందుకు కేటీఆర్, హరీశ్లను పంపు..
ఉస్మానియాలో బడుగు, దళిత విద్యార్థులను ముందు పెట్టి రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు దమ్ముంటే కేటీఆర్, హరీశ్లను ముందు నిలబెట్టి రాహుల్ పర్యటనను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకుల్ని కింద పడేసి తొక్కి ఓయూ పర్యటన చేస్తారని రేవంత్ అన్నారు.