మహా సీఎంతో చీకటి ఒప్పందం: 'కాళేశ్వరంతో తెలంగాణకు దరిద్రం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించదలచిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తోనే తెలంగాణకు దరిద్రం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
ఉత్తర తెలంగాణలో ఏనాడూ దరిద్రం లేదని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలంగాణకు దరిద్రం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. తమ్మిడిహట్టి వద్ద 155 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మిస్తేనే తెలంగాణకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
అయితే ఇందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తున్నారని తద్వారా తెలంగాణకు ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. మహారాష్ట్ర సీఎంతో చేసుకున్న చీకటి ఒప్పందం ప్రకారంగానే ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు.