రేవంత్ పై కాంగ్రెస్ నేతల ఆగ్రహం .. ప్రగతి భవన్ ముట్టడినే రీజన్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కన్నెర్ర చేస్తున్నారు. నిన్న ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా రేవంత్ రెడ్డి చూపించిన దూకుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే రేవంత్ ఇలా దూసుకుపోవటం తెలంగాణకాంగ్రెస్ సీనియర్ నాయకులకు నచ్చటం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోమారు బయటకు వచ్చాయి.
మూడు వేల మంది పోలీసులు.. మూడంచెల భద్రత.. ఐనా ప్రగతి భవన్ గడీని ఢీ కొట్టిన రేవంత్ రెడ్డి..!!
రేవంత్ రెడ్డి ఎవరినడిగి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అంటూ పార్టీలోని సీనియర్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎవరిని సంప్రదించి ప్రగతి భవన్ ముట్టడి ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి సంబంధించి తనకు కనీసం సమాచారమైనా ఇవ్వలేదని మండిపడుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలను ఎవరినీ సంప్రదించకుండా, ఎవరికీ చెప్పకుండా తనకు తాను నిర్ణయాలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం మీడియాకు నోట్ రిలీజ్ చేసి ఊరుకుంటే ఎట్లా అని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, సంపత్ కుమార్, కోదండ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఎవరినీ సంప్రదించకుండా రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు అని , ఇక ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని వారు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారన్న విషయం తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతుంది.