కాళేశ్వరం అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతల అరెస్టులు.!సీఎం కేసీఆర్ పై రేవంత్,భట్టి ఫైర్.!
హైదరాబాద్ : సీఎం చంద్రశేఖర్ రావు అవినీతికి పాల్పడకపోతే పరిశీలనకు వెళ్తున్న వారిని అడ్డుకోవడం ఏంటని, కాంగ్రెస్ ఎమ్మెల్యే లను అరెస్టులు చేసి ఖమ్మం జిల్లా అంతా తిప్పుతుండడంలో ఆంతర్యం ఏంటని టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి మండి పడ్డారు. ఒక్కొక్క పోలీస్ స్టేషన్ చుట్టూ మార్చి మార్చి తిప్పుతూ తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారని, ఇంతకంటే దుర్మార్గమైన చర్య మరొకటి లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్య వాదులు ఇలాంటి చర్యను వ్యతిరేకించాలని, ప్రాజెక్టుల ఆలస్యానికి కారణాలు, నాణ్యత, పనులు జరుగుతున్న తీరును పరిశెలించడం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని, ప్రజల పక్షాన అవినీతిపైన పోరాటం తమ హక్కు అని, తమ హక్కులను, బాధ్యతల పాలకులు హరిస్తున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
ప్రభుత్వ పనితీరు పర్యవేక్షించడం ప్రతిపక్షాల హక్కు.. ప్రాజెక్టుల పర్యటన అడ్డుకోవడం దుర్మార్గమన్న రేవంత్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాజెక్టులు పరిశీలిస్తే సీఎం చంద్రశేఖర్ రావుకు అంత ఉలుకు ఎందుకని, అవినీతి జరగకపోయి ఉంటే అధికారులే దగ్గర ఉండి ప్రాజెక్టులను చూపించాలి కదా అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఏమైనా ఉగ్రవాదులా.?ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీఎల్పీ బృందానికి ప్రభుత్వమే దగ్గర ఉండి ప్రాజెక్టులను చూపించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుడుతామన్నారు రేవంత్ రెడ్డి. సీఎం చంద్రశేఖర్ రావు పాలనకు ఇదే అంతం అవుతుందన్నారు రేవంత్ రెడ్డి.
కాళేశ్వరంలో అవినీతి జరిగింది.. అందుకే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నాడన్న పీసిసి ఛీఫ్
ప్రాజెక్టుల నిర్మాణంలో దాగి ఉన్న రహస్యం ఏంటని, సీఎల్పీ బృందాన్ని ఎందుకు చూడనివ్వడం లేదని, ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా, పోలీసులు అడ్డుకున్నా, కాలేశ్వరం ప్రాజెక్టు వెళ్లి తీరుతామన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? పోలీసు రాజ్యం నడుస్తుందా?అని మండిపడ్డారు. పోలీసు రాజ్యం తీసుకురావడం కోసమే తెలంగాణ తెచ్చామా? సీఎం చంద్రశేఖర్ రావు తన పరిపాలన పోలీసులతోనే కొనసాగిస్తాడా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గౌరవం లేదా? ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టుల పురోగతి తెలుసుకోవడం ప్రజలకు హక్కు లేదా.? అని రేవంత్ సీఎం కు ప్రశ్నల వర్షం కురిపించారు.
నిర్బంధ పాలన ఇంకెన్నాళ్లు.. ప్రభుత్వం కళ్లు తెరవాలన్న రేవంత్ రెడ్డి
ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆదాయం తెచ్చిన అప్పులు కాళేశ్వరంలో ధారపోసి ఏం అభివృద్ధి సాధించారో తెలుసుకోవడానికి సిఎల్పి బృందం ప్రాజెక్టుల సందర్శనకు బయలుదేరిందని, ప్రభుత్వ తప్పిదాలు అవకతవకలు బయటపడతాయని పోలీసులతో అడ్డుకుంటున్నట్లు స్పష్టమవుతున్నదని రేవంత్ తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాజెక్టుల సందర్శన చూడకుండా భద్రాచలం దుమ్ముగూడెం మణుగూరు క్రాస్ రోడ్ల వద్ద పోలీసులు అడ్డుకున్నారన్నారు. భద్రాచలంలో అరెస్టు చేసిన పోలీసులు పాల్వంచ తీసుకొచ్చి అక్కడ నుంచి ఇల్లందు పోలీస్ స్టేషన్కు తరలించారు అక్కడి నుంచి కూడా మరోచోటికి తరలించే ప్రయత్నం చేస్తుండగా తమ కార్యకర్తలు అడ్డుకొని నిలదీయడంతో ఇల్లందు గెస్ట్ హౌస్ కు తరలించారని తెలిపారు.
కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం పిరికిపంద చర్య.. సీఎం పై భట్టి ఫైర్
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ లో పర్యటించడానికి ప్రభుత్వం అనుమతి దేనికోసం? తెలంగాణ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పొడెం వీరయ్య లను అరెస్ట్ చేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్య అన్నారు భట్టి. అరెస్టులను, నిర్బంధకాండను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం పిరికిపంద చర్య అని, అవినీతికి పాల్పడుతూ సీఎం చంద్రశేఖర్ రావు ఇలాంటి నిర్బంధ కాండను చేస్తే ప్రజల చేతిలో శిక్ష తప్పదన్నారు భట్టి విక్రమార్క. ప్రాజెక్టులు చూడకుండా అడ్డుకోవడం అప్రజాస్వామిక చర్య అని, నియంత పోకడలకు పరకాష్ట అన్నారు భట్టి.