'కిషన్ రెడ్డి! ఒళ్లు దగ్గర పెట్టుకో, మోడీకి లాడెన్ పేరు పెడతావా'
హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తన పేరును యాకూబ్గా మార్చుకోవాలన్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నేతలు గురువారం నాడు భగ్గుమన్నారు. రాహల్ గాంధీని పేరు మార్చుకోవాలని చెప్పడం సరికాదన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి హనుమంత రావులు కిషన్ రెడ్డి వ్యాఖ్యల పైన స్పందించారు. తొలుత కిషన్ రెడ్డి తన పేరును మార్చుకోవాలని, ప్రధాని నరేంద్ర మోడీ పేరు మార్చగలరా అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీని పేరు మార్చుకోమని కిషన్ రెడ్డి చెప్పడం సరికాదని మల్లు భట్టి అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం నుంచి రాహుల్ వచ్చారన్నారు. మొదట కిషన్ తన పేరు వెనుక తోకను తొలగించుకొని, గాడ్సే అని పెట్టుకోవాలని ధ్వజమెత్తారు.

ప్రధాని నరేంద్ర మోడీకి లాడెన్ పేరు పెడతావా అని వి హనుమంత రావు.. కిషన్ రెడ్డిన ప్రశ్నించారు. రాహుల్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి ఉగ్రవాది పేరు పెట్టాలనడం సరికాదన్నారు.
కిషన్ రెడ్డి గాడ్సే వారసుడిలా మాట్లాడటం సరికాదని పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాహుల్ పేరును మార్చుకోవాలన్న వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఉపసంహరించుకోవాలన్నారు. పాలమూరు ప్రాజెక్టు పైన జగన్, దేవినేని వ్యాఖ్యలు సరికాదన్నారు.












Click it and Unblock the Notifications