టిడిపి నేతను తుపాకీతో బెదిరించిన కాంగ్రెస్ నేత, కిందపడితే తీశానని వివరణ
వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య భూమి వివాదం విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు టిడిపి నాయకుడిని తుపాకీతో బెదిరించారు.
దీంతో, హన్మకొండలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భూవివాదం విషయంలో కాంగ్రెస్, టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు మురళీ మధ్య తోపులాట జరిగింది.
ఓ సమయంలో కాంగ్రెస్ నేత రాజేందర్ రెడ్డి తుపాకీ తీసి మురళీని బెదిరించాడని తెలుస్తోంది. మిగతా కాంగ్రెస్ కార్యకర్తలు రాజేందర్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం జరుగుతుందో తెలియక ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కాసేపు అయోమయానికి గురయ్యారు.

తుపాకీతో బెదిరించడం అవాస్తవం: రాజేందర్రెడ్డి
భూవివాదం విషయమై కాంగ్రెస్, టిడిపి నేతల మధ్య జరిగిన ఘర్షణపై డీసీసీ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి స్పందించారు. తాను తుపాకీతో బెదిరించిన వార్తలు అవాస్తవమన్నారు. తుపాకీ కింద పడుతుంటే పట్టుకున్నానన్నారు.
ఈ అంశంలో టిడిపి నేతలు అనవసర రాద్ధాంతం చేశారని ఆరోపించారు. అది ప్రభుత్వ భూమి కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్లానన్నారు. టిడిపి అర్బన్ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ... తుపాకీతో బెదిరించిన రాజేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి, లైసెన్సును రద్దు చేయాలన్నారు.
ప్రతి ఆడపిల్లను చదివించుకోవాలి
అందంగా పేర్చిన బతుకమ్మలతో, వేలాదిగా తరలివచ్చిన ఆడపడుచులతో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దారులన్నీ నిండిపోయాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం నర్సంపేటలో బంగారు బతుకమ్మ వేడుకలను ఎంపీ కవిత ప్రారంభించారు.
ఉదయం నుంచి మొదలైన ఈ వేడుకలు అనాథలు, పేదల మధ్యే సాగింది. ఎంపీ కవిత మొదట సంజీవని ఆశ్రమంలో అనాథ పిల్లలతో పాటలు పాడుతూ బతుకమ్మలు పేర్చారు. తర్వాత టీఆర్ఎస్ కాలనీలోని పేదల గుడిసెల మధ్య, అనంతరం ఎస్సీ కాలనీలో పాటలు పాడి బతుకమ్మలు తీర్చిదిద్దారు.
సాయంత్రం ఆరు గంటలకు నెక్కొండ రోడ్లోని రెడ్డి ఫంక్షన్ హాలు నుంచి ర్యాలీగా బయల్దేరి అమరవీరుల స్తూపం నుంచి అంగడి మైదానానికి చేరుకున్నారు. అక్కడ మహిళలను బృందాలుగా చేసి ఒక్కో బృందంతో కవిత బతుకమ్మ ఆడారు.
మహిళలు ఎవరి మీదా ఆధారపడకుండా స్వావలంబన సాధించే దిశగా కదలాలని పిలుపునిచ్చారు. అంగడి మైదానంలో మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళ ఎప్పుడూ తన గురించి తాను ఆలోచించుకోదని, కుటుంబ సభ్యుల అవసరాల్ని తీరుస్తుంటుందని, బతుకమ్మ పండుగ పూర్తిగా మహిళలదేనని, వారు ఎవరి మీదా ఆధారపడకుండా ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు.












Click it and Unblock the Notifications