సోనియాను కలుస్తా.. ఒంటరిగా పోరాడతా.. రాజీనామాపై జగ్గారెడ్డి క్లారిటీ..
కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తనకు రాజీనామ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని .. జీవితాంతం ఉంటానని చెప్పారు. పార్టీకి డ్యామేజ్ చేయాలన్న ఆలోచన తనకు లేదన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసి తన బాధను అధిష్టానానికి నేరు వివరిస్తానని పేర్కొన్నారు. తన వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే.. ఒంటరిగానే ఉంటానని తేల్చిచెప్పారు.
రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్క్ష్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో తలపెట్టిన 'రచ్చబండ' కార్యక్రమం ఆ పార్టీలో పెద్ద రగడకు దారి తీసింది. తన జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఎలా నిర్వహిస్తారని ఆపార్టీ ఎమ్మెల్యే , వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రచ్ఛబండ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో రచ్చబండను నిర్వహించలేకపోయారు.. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రచ్చ రాజేసింది. చివరి పార్టీ సీనియర్ నేతలు సహితం రేవంత్ తీరును తప్పుపట్టారు. పార్టీలో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.
రాజీనామా వార్తలు ఆవాస్తవం.. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా..
రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. దీంతో పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డిలు రంగంలోకి దిగారు. జగ్గారెడ్డితో వరుసగా భేటీ అయ్యారు. రాజీనామా వంటి ఆలోచనలను విరమించుకోవాలని బుజ్జగించారు. అనంతరం మీడియాతో ముందుకు వచ్చిన జగ్గారెడ్డి తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తలను ఖడించారు. తను రాజీనామా చేయడంలేదని .. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని.. ఏ పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు.
సోనియాను కలుస్తా.. నా మొర వినిపిస్తా..
సంక్రాంతి పండుగ తరువాత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల ను కలవనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. వారి వద్దే తన భాధను వివరిస్తానని చెప్పారు. పార్టీ అంతర్గత సమావేశంలో జరిగిన విషయాలను బయటపెట్టన్నారు. తన భాధను పీఏసీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఠాగూర్ కు తెలియజేశానని చెప్పారు. పార్టీని విడేది లేదు. తాను సోనియా , రాహుల్ గాంధీల నాయకత్వంలోనే జీవితాంతం పనిచేస్తానని చెప్పారు. తన వల్ల పార్టీలో ఎవరైనా ఇబ్బందులు పడితే... ఇండిపెండెంట్ గా ఉంటాను తప్పితే మరో పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఈనెల 8 నిరాహార దీక్ష
పేద ప్రజలపై కేసీఆర్ సర్కార్ కక్ష కట్టిందని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గ్రామాల్లో పేదలు కట్టుకున్న ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరారు. లక్షల రూపాయాలు అప్పుచేసి ప్రజలు నిర్మించుకుంటున్న వాటిని కూల్చడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోణంలో ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లే అవుట్లను , ఇళ్లను కమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు..