సాగర్లో నేను బీజేపీ తరుపున దిగితే... జానారెడ్డి మూడో స్థానానికే పరిమితం... రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీనే ప్రత్యామ్నాయమని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ హస్తం పార్టీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికీ బీజేపీలో చేరే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గత కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు అంశంపై తాజాగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక : కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి... అధికారికంగా ఖరారు చేసిన అధిష్టానం...
నేను పోటీ చేస్తే జానారెడ్డికి మూడో స్థానమే : రాజగోపాల్ రెడ్డి
బీజేపీ నేతలు తనను పార్టీలో చేరాలని కోరుతున్నట్లు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతేకాదు,నాగార్జునసాగర్ ఉపఎన్నిక నుంచి పోటీ చేయాలని కూడా బీజేపీ తనను కోరుతున్నట్లు చెప్పారు. తాను నాగార్జునసాగర్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని.. జానారెడ్డి మూడో స్థానానికే పరిమితమవుతారని అన్నారు. అయితే పార్టీ మార్పుపై తాను ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు.
నిర్ణయం తీసుకోలేదంటూనే సాగర్లో తాను పోటీకి దిగితే జానారెడ్డి ఓటమి ఖాయమన్నట్లుగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది.
గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు...
గతంలో ఓ సందర్భంలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని కూడా అంతా భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. పైగా ప్రజలే కాంగ్రెస్కు షోకాజ్ నోటీసులిస్తారని రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.అయినప్పటికీ కాంగ్రెస్ ఆయన్ను కదిలించే పని చేయలేదు. తాను సాగర్లో పోటీ చేస్తే జానారెడ్డికి ఓటమి తప్పదని సొంత పార్టీ నేత పైనే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనే ఆయన వ్యాఖ్యలను లైట్ తీసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కూడా ఆయన్ను మందలించే అవకాశం కనిపించట్లేదు.
సాగర్ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి
సాగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దుబ్బాక,జీహెచ్ఎంసీల్లో వరుస పరాభవాలను మరిపించాలంటే సాగర్ గడ్డపై సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అదే సమయంలో సాగర్లో బలమైన కాంగ్రెస్ నేత జానారెడ్డి పోటీకి దిగుతుండటంతో ఆ పార్టీ గెలుపుపై చాలా ఆశలు పెట్టుకుంది. మరోవైపు సాగర్లో పెద్దగా పట్టు లేని బీజేపీ ఇక్కడ బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. నివేదితా రెడ్డి,అంజయ్య యాదవ్ లాంటి ఆశావహులు టికెట్లు కోరుతున్నా... బీజేపీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డి వైపు చూస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే మాటల్లోనే స్పష్టమైంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఉన్న నియోజకవర్గానికి రాజీనామా చేసి సాగర్లో బీజేపీ తరుపున బరిలో దిగడం దాదాపు జరగదనే చెప్పాలి. పార్టీలో బలమైన నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ చాలాకాలంగా పార్టీలో నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే అధిష్టానం వారిని పక్కనపెడుతుండటంతో రాజగోపాల్ రెడ్డిలో ఒకింత అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మార్పుపై తరుచూ ప్రచారం జరుగుతోంది.