జానారెడ్డి ఎందుకిలా?, కాంగ్రెస్కు ఝలక్, 'విప్' పదవికి సంపత్ రాజీనామా
అసెంబ్లీలో సొంత పార్టీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నల్ల కండువా ధరించి శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పై అసెంబ్లీలో చర్చ సందర్బంగా సీఎల్పీ నేత జానారెడ్డి వ్యవహరించిన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పార్టీ 'విప్' పదవికి రాజీనామా చేశారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లుపై మాట్లాడే అవకాశం పార్టీ తనకు ఇవ్వకపోవడంతో నల్లకండువా ధరించి ఆయన నిరసన తెలియజేశారు. శనివారం నాటి అసెంబ్లీ సమావేశాలకు ఆయన నల్లకండువాతో వచ్చారు.
సంపత్ కుమార్ అలకను గమనించిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిన్నారెడ్డిలు సంపత్ కుమార్ ను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ సంపత్ కుమార్ జానారెడ్డి తీరు పట్ల అలక వీడనట్లుగానే తెలుస్తోంది. మీడియా పాయింట్ వద్ద మాట్లాడినప్పుడు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని సంపత్ కుమార్ వెల్లడించారు.
శుక్రవారం అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై చర్చ జరుగుతున్న సమయంలో వంశీచంద్ కు మైక్ ఇవ్వాలని పదే పదే కోరిన జానారెడ్డి, తనకు మాత్రం మైక్ ఇవ్వాలని కోరకపోవడం బాధాకరమని సంపత్ కుమార్ అన్నారు. సంక్షేమ పద్దులపై చర్చలో ప్రభుత్వ విధానాన్ని ఎత్తిచూపినందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు.
ప్రభుత్వ ఒత్తిడికి స్పీకర్ తలొగ్గారని, అందుకే ఎస్సీ, ఎస్టీ బిల్లుపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ కమిటీ సభ్యుడినైనా తనకే మాట్లాడేందుకు అవకాశం రాకుండా చేయడం బాధాకరమన్నారు.
ఆఖరికి సొంతపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తనవైపు నిలవలేదని, అందుకే నేటి సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులతో కాకుండా ప్రత్యేకంగా కూర్చుంటానని సంపత్ కుమార్ తెలిపారు. జోకర్లు, బ్రోకర్ల కోసం రాత్రి 11గం. వరకు సభ నడిపారని ఆయన మండిపడ్డారు.