'టేపులు ఎక్కడివో బయటపెట్టండి', మీడియా స్వేచ్ఛపై ఏపీ సీఎం దాడి
హైదరాబాద్: ఏపీ పోలీసులు తెలంగాణ న్యూస్ ఛానెల్ అయిన టీ న్యూస్కు నోటీసులివ్వడంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఊపందుకున్నాయి. ఈ నోటీసులపై అటు తెలంగాణ, ఇటు ఏపీ రాజకీయ నేతలు వాడివేడిగా మాట్లాడుతున్నారు.
ఈ సందర్భంగా టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ టీ న్యూస్ ఛానల్కు ఆ టేపులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు గగ్గోలు పెట్టకుండా జవాబు చెబితే సరిపోతుందని శనివారం ఆయన మీడియా సమావేశంలో అన్నారు.
అంతేకాదు రేవంత్ రెడ్డి అరెస్టుకు ముందు గంటలో మీరో సంచలన వార్త వింటారని తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల్లోనే టీ న్యూస్ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైందని విమర్శించారు. తెలంగాణలో విలువలు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్కు లేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ కోసం పోరాడిన గౌరవం జర్నలిస్టులకు ఉందని, టీ న్యూస్ ఛానల్ కోసం ధర్నా చేసి తెలంగాణ జర్నలిస్టులు గౌరవం పొగొట్టదని అన్నారు. మరోవైపు టీ న్యూస్ ఛానల్కు నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్పై ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఆధారాలు చూపలేదని అన్నారు. ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8 అంటూ గవర్నర్పై టీడీపీ మంత్రులు దాడి చేశారని గుర్తు చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు పదవికి రాజీనామా చేసి విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.