రాహుల్ గాంధీ పర్యటనతో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందా? రేవంత్ వ్యూహం ఇదేనా!!
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ టూర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ తెస్తుందా? రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ పార్టీకి హైప్ క్రియేట్ చేస్తుందా? రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను రేవంత్ రెడ్డి పార్టీకి అనుకూలంగా వాడుకుంటున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
తెలంగాణా రాహుల్ పర్యటన .. మైలేజ్ కోసం కాంగ్రెస్ వ్యూహం
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు పర్యటన చేయనున్నారు. ఆరవ తేదీన వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇక ఈ సభకు లక్ష మంది హాజరవుతారని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే జన సమీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పే విధంగా వ్యూహాత్మకంగా ఈ సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటనలో భాగంగా షెడ్యూల్ ప్రకారం గాంధీభవన్ సమీక్ష ఒకటే నిర్వహించాల్సి ఉండగా, కాంగ్రెస్ నేతలు ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ గాంధీ భేటీ ఏర్పాటు చేయడం ప్రస్తుతం రచ్చకు కారణంగా మారింది.
ఉస్మానియా విద్యార్ధి నాయకుల అరెస్ట్ .. కాంగ్రెస్ కొత్త వ్యూహం
ఉస్మానియా యూనివర్సిటీ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలనుకున్న రాహుల్ గాంధీ విద్యార్థులతో భేటీ కార్యక్రమానికి వీసీ అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ నేతలు అధికార టిఆర్ఎస్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. రాహుల్ గాంధీ పర్యటన అంటే కెసిఆర్ కు భయం పట్టుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక ఉస్మానియా యూనివర్సిటీ లో రాహుల్ గాంధీ పర్యటన కు అనుమతి ఇవ్వాలని ఎన్ ఎస్ యు ఐ మరియు యూత్ కాంగ్రెస్ విభాగం ఉస్మానియా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను, ఇదే సమయంలో ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వెంకట్ తో పాటు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారిని చంచల్గూడ జైలుకు 14 రోజుల రిమాండ్ మీద తరలించారు. ఇక దీంతో కాంగ్రెస్ పార్టీ మరో కొత్త వ్యూహాన్ని రచించింది.
జైల్లో ఉన్న నాయకులకు రాహుల్ గాంధీ పరామర్శ
14 రోజుల రిమాండ్ లో భాగంగా జైలులో ఉంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలను బయటకు తీసుకురావడానికి బెయిల్ కోసం ప్రయత్నాలు చేయకుండా, రాహుల్ గాంధీ తో పరామర్శకు ఏర్పాట్లు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు జైల్లో ఉన్న విద్యార్థి నాయకులను పరామర్శించారు. ఇక రాహుల్ గాంధీని విద్యార్థి నాయకులు పరామర్శించడానికి జైలుకు తీసుకు వెళితే కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజీ వస్తుందని భావిస్తున్న రేవంత్ రెడ్డి, జైల్లో రాహుల్ గాంధీ ములాకత్ కు దరఖాస్తు చేసినట్టుగా సమాచారం.
ఉస్మానియాలో రాహుల్ పర్యటన కోసం కాంగ్రెస్ పోరాటం.. టీఆర్ఎస్ ఆటంకాలను వాడుకునే వ్యూహం
ఇదిలా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ లో రాహుల్ గాంధీ విద్యార్ధులతో భేటీ కోసం ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉస్మానియా వేదికగా ఆందోళనలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ నేతలు కేసీఆర్ దిష్టి బొమ్మల దహనాలు నిర్వహించారు.రాహుల్ గాంధీ పర్యటన విషయంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూ, రాహుల్ పర్యటన కు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనను అదే పనిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రోజంతా వార్తల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలను నిలువరించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా తమకు అనుకూలంగా మలచుకుంటూ ప్రతి చిన్న అవకాశాన్ని వదలకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అన్నసంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.