ఎట్టకేలకు కాంగ్రెస్ తొలి జాబితా విడుదల...9 మందితో టిడిపి ఫస్ట్ లిస్ట్:టిజెఎస్ కూడా?
Recommended Video
హైదరాబాద్:ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేయబోయే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ను విడుదల చేసింది. సోమవారం ఆర్థరాత్రి న్యూ ఢిల్లీలో నాటకీయ పరిణామాల మధ్య ఈ ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేసింది.
కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ విడుదల చేసిన తెలంగాణా ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి విడత జాబితాలో 65 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ లిస్ట్ లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 14 మందికి చోటు లభించగా, పిసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కక పోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తొమ్మిది మంది అభ్యర్థులతో టీటీడీపీ తొమ్మిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తమ పార్టీ తొలి జాబితాను కూడా ప్రకటించింది.
తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదలపై సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫస్ట్ లిస్ట్ లో అభ్యర్థుల అభ్యర్థుల ఖరారు కోసం సోమవారం న్యూ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణా అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్తచరణ్దాస్, సభ్యులు శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, శ్రీనివాసన్ కృష్ణన్, సలీం అహ్మద్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి సమావేశమయ్యారు.
రెండు విడతలుగా జరిగిన ఈ సమావేశం అనంతరం కూడా జాబితా విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై రాహుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇక సోమవారం రాత్రి 11.20 ప్రాతంలో హడావుడిగా కాంగ్రెస్ మొదటి విడత జాబితా విడుదల అయింది. ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో మొత్తం 65 మంది పేర్లు ఉండగా మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, పోరిక బలరాం నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సర్వే సత్యనారాయణ, మల్లు రవిలకూ ఈ జాబితాలో చోటు లభించింది. అయితే అనూహ్యంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. అలాగే మర్రి శశిధర్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి పేర్లు కూడా తొలి జాబితాలో లేవు. ఉస్మానియా విద్యార్థులకు అవకాశం కల్పించలేదు.
మరోవైపు తొమ్మిది మంది అభ్యర్థులతో టీటీడీపీ తొలి జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. అయితే కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ఈ జాబితాలో లేకపోవటం గమనార్హం. మంగళ, బుధవారాల్లో టిడిపి మిగిలిన ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిసింది. మరోవైపు టీజేఎస్ నుంచి కూడా ముందుగా మంగళవారం 8 మంది పేర్లను ప్రకటించనున్నట్లు సమాచారం.