కాంగ్రెస్ ఓకే: టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ, పొత్తులపై పెద్దిరెడ్డి ఏమన్నారంటే.?
అమరావతి: తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత అక్కడి రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పలువురు తెలుగుదేశం నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
చంద్రబాబుతో సమావేశం అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్.. టీడీపీతో పొత్తుకు సిద్దమంటోందని తెలిపారు. కోదండరామ్, లెఫ్ట్ పార్టీలు ఐక్య కూటమితో వెళ్దామనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయని వెల్లడించారు.
చంద్రబాబుతో చర్చించాక.. అన్ని రకాలుగా ఆలోచించి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని పెద్దిరెడ్డి తెలిపారు. అభ్యర్ధుల జాబితా శుక్రవారం నాటికి తామూ ప్రకటించగలమని, కానీ అందరితో చర్చించాకే ప్రకటించాలన్నది తమ విధానమని పెద్దిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం భస్మాసుర హస్తమేనని దుయ్యబట్టారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమేనని తెలిపారు.
ఎల్లుండి హైదరాబాద్కు చంద్రబాబు
తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇక్కడ నేతలతో చర్చించేందుకు చంద్రబాబు ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు.
రాష్ట్రపతి పాలన విధించాలి: కోదండరాం
అసెంబ్లీని రద్దు చేసి కేసీఆర్ తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. మంచి పాలన అందించే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయరని అన్నారు. ప్రజల ఆక్షాంక్షలను నేరవేర్చటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అసమర్థ పాలనను అంతమొదించేందుకు జన సమితి బయలుదేరుతుందన్నారు.
మార్పు కోసం అందరూ కలిసి పని చేయాలని.. కేసీఆర్ను గద్దే దించడమే తమ లక్ష్యమన్నారు కోదండరామ్. ఆపద్ధర్మ పదువులు వదిలి ప్రజాక్షేత్రంలోకి రావాలని కేసీఆర్కు ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించడం సరైంది కాదని, గవర్నర్ను కలిసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తొలగించాలని కోరతామన్నారు. గవర్నర్ను కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నట్లు కోదండరామ్ తెలిపారు. త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.