ఐపీఎస్ ప్రవీణ్ vs బీజేపీ.. బండి సంజయ్ను చంపే కుట్ర అని ఆరోపణలు... కొట్టిపారేసిన పోలీసులు...
తెలంగాణలో ప్రస్తుతం ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ వర్సెస్ బీజేపీగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్దపల్లి జిల్లా ధూళికట్టలో భీమ్ దీక్ష ప్రారంభోత్సవంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటన నేపథ్యంలో బీజేపీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్పై చర్యలకు డిమాండ్ చేసింది. స్వేరోస్ ముసుగులో హిందూ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన స్వేరోస్ సభ్యులు... బుధవారం(మార్చి 17) హుజూర్నగర్ పర్యటనలో బండి సంజయ్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలకు,స్వేరోస్ సభ్యులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అయితే సంజయ్ని చంపేందుకు కుట్ర జరుగుతోందని తాజాగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ను చంపే కుట్ర : విజయ రామారావు
మాజీ మంత్రి,బీజేపీ నేత విజయరామారావు ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని చంపేందుకు కుట్ర జరుగుతోంది. బండి సంజయ్పై స్వేరోస్ హత్యాయత్నాన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం దారుణం.ఒక ఎంపీ,జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే భద్రత కల్పించకపోతే ఇక సామాన్యులకు రక్షణ కల్పించగలరా... సంజయ్ కుమార్కు రక్షణ కల్పించడంలో పోలీసుల వైఫల్యాన్ని బీజేపీ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోంది. దాడికి పాల్పడినవారిని గుర్తించి,వెంటనే చర్యలు తీసుకోవాలి.' అని విజయ రామారావు డిమాండ్ చేశారు.
ప్రవీణ్ అనుచరుల హత్యాయత్నం : బీజేపీ ఎస్సీ మోర్చా
తెలంగాణ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా కూడా అవే ఆరోపణలు చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు,ఎంపీ సంజయ్పై ఐపీఎస్ ప్రవీణ్ అనుచరుల హత్యాయత్నాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. హుజూర్నగర్ నుంచి హైదరాబాద్ వస్తోన్న సంజయ్ కాన్వాయ్పై స్వేరోస్ కార్యకర్తలు దాడికి తెగబడటం దారుణమన్నారు. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు.

హత్యాయత్నం ఆరోపణలను ఖండించిన పోలీసులు...
మరోవైపు పోలీసులు బీజేపీ నేతల ఆరోపణలను ఖండించారు. బండి సంజయ్పై హత్యాయత్నం జరగలేదని... స్వేరోస్ సభ్యులు,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆయన కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఈ క్రమంలో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుందన్నారు. ఆయన పర్యటనకు పూర్తి స్థాయి బందోబస్తు కల్పించామని చెప్పారు. మిర్యాలగూడ మీదుగా పోలీస్ బందోబస్తుతో ఆయన వాహనాన్ని పంపించినట్లు తెలిపారు. కానీ ఈ ఘటనపై కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయనపై హత్యాయత్నం జరిగిందని... సూర్యాపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాగ్యరెడ్డి కారుపై ఇనుప రాడ్లతో దాడి చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. భాగ్యరెడ్డి కారు అద్దం గతంలోనే ధ్వంసమైందని వారే చెప్పినట్లు తెలిపారు. కాబట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఆపాలని... లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంజయ్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంజయ్ వ్యాఖ్యలను ఖండించిన ఐపీఎస్ అధికారుల సంఘం
అటు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం బండి సంజయ్ ఆదిలాబాద్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక లేఖ విడుదల చేశారు.బండి సంజయ్ లాంటి సీనియర్ నేత అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది. భైంసాలో శాంతిభద్రతల పునరుద్దరణకు పోలీసులు అధికారులు చట్ట పరిధిలో అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారని అందులో పేర్కొన్నారు. పోలీస్ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించిన పోలీసులపై ఇలాంటి నిందలు వేయడం నేరస్తులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి,శాంతిభద్రతల విచ్చిన్నానికి దారితీసే పరిస్థితులను కల్పిస్తుందని పేర్కొన్నారు. సంజయ్ చేసిన ఆరోపణలు సత్య దూరంగా ఉన్నాయని.. అవి నిరాధారమని పేర్కొన్నారు. పోలీసులపై చేసిన ఆ నిరాధార ఆరోపణలను ప్రజలెవరూ పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా,ఆదిలాబాద్ పర్యటన సందర్భంగా ఐపీఎస్ల అంతు చూస్తామని బండి సంజయ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. భైంసా అల్లర్లలో అరెస్టయిన హిందూ వాహిని కార్యకర్తలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఆయన పరామర్శించారు. ఐపీఎస్ అధికారులు హిందూ వాహిని కార్యకర్తలపై థర్డ్ ప్రయోగించారని... నేరం ఒప్పుకోవాలని చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను తాజాగా ఐపీఎస్ అధికారుల సంఘం ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది.












Click it and Unblock the Notifications