కరీంనగర్ కి కరోనా పాజిటివ్ ఉన్న ఇండోనేషియన్లు... రప్పించిన వ్యక్తి అరెస్టు
కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికి 22మందిని బాధితులుగా మార్చింది. ఇంకా ఎందరో అనుమానితులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు . మొదట కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు.కానీ ఒక్కసారిగా కరీంనగర్ లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ ఉందని తేలటంతో తెలంగాణా సర్కార్ ఉలిక్కిపడింది. ఇండోనేషియన్లకు కరోనా అని తెలియటంతో అసలు వారు ఎవరు ఎందుకు వచ్చారని దర్యాప్తు మొదలు పెట్టింది .
కరీం నగర్ కరోనా బాధితులైన ఇండోనేషియన్లపై అనుమానాలు
కరీంనగర్ లో ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ అని తెలియగానే కరీం నగర్ కు హుటాహుటిన 100 వైద్య బృందాలను పంపింది . ఇక కరీంనగర్ కు వచ్చి బస చేసిన పలు ప్రాంతాల్లో సందర్శించిన ఇండోనేషియాకు చెందిన మత బోధకుల ద్వారా కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని భావించిన ప్రభుత్వం కరీంనగర్ లో ఆంక్షలు విధించి మరీ ఇండోనేషియన్లు సందర్శించిన ప్రాంతాలలో శుభ్రతా చర్యలు చేపట్టింది. ప్రజలను స్క్రీనింగ్ చేసింది . అయితే ఇండోనేషియన్లు కరీంనగర్ లో సంచరించటంపై పలు అనుమానాలు, విమర్శలు వ్యక్తం అయ్యాయి.
కరోనా లక్షణాలున్న జమీల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ
కావాలనే వారు వచ్చారని, వారు అనుమానాస్పదంగా సంచరించారని పలు విమర్శలు వచ్చిన నేపధ్యంలో తాజాగా కరీంనగర్లో కరోనా లక్షణాలున్న జమీల్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కరీంనగర్ కు ఇండోనేషియా బృందాన్ని జమీల్ అనే వ్యక్తే రప్పించినట్లు చెబుతున్నారు. జమీల్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కీలక నేత అని తెలుస్తుంది. అలాగే జమీల్ నిబంధనలకు విరుద్దంగా ఓ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారన్న సమాచారంతో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని కరీంనగర్ సీపీ పేర్కొన్నారు. అయితే అతనికి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.
ఇండోనేషియన్లను రప్పించిన వ్యక్తి ని అరెస్ట్ చేశామని చెప్పిన పోలీసులు
అతడిని బైండోవర్ చేసాక తప్పించుకున్నాడని, మూడు రోజుల పాటు అతను తప్పించుకుని తిరిగాడని ఎట్టకేలకు నిన్న రాత్రి అరెస్ట్ చేశామని చెప్పారు. ఇక అతన్ని హాస్పిటలో ఐసోలేషన్ కి పంపించామని అతనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇండోనేసియా దేశస్థులు కరీంనగర్కు రావడం వెనుక ఉన్న కారణం ఏంటి ? వారు ఇక్కడ పలు ప్రాంతాలు సందర్శించడం దేని కోసం వంటి వివరాలు సేకరిస్తున్నారు. ఇక జమీల్ వారికి సాయపడ్డట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకే జమీల్ ను విచారిస్తున్నారు .