తెలంగాణలో మరో కరోనా మరణం: 7కు చేరిక, వైద్య సిబ్బందిపై దాడి, మంత్రి ఈటెల వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కరోనా మరణం చోటు చేసుకుంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధిత రోగి బుధవారం మృతి చెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. తాజా మరణంతో తెలంగాణలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7కు చేరింది.

వైద్య సిబ్బంది దాడి..
కాగా, గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి చెందినట్లు ప్రకటించగానే.. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు తీవ్ర ఆగ్రహానికి గురై వైద్యులపై దాడి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఈ విషయాన్ని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతోపాటు స్థానిక పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆయన చెప్పారు.

గాంధీకి సీపీ అంజనీకుమార్...
అయితే, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వచ్చిన తర్వాతే స్థానిక పోలీసులు స్పందించారని శ్రవణ్ తెలిపారు. ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న వైద్యులపై దాడి చేయడం సరికాదని, ఈ ఘటన గురించి వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. వైద్యుల విషయంలో రోగులు సంయమనం పాటించాలని కోరారు. కాగా, మృతి చెందిన రోగితోపాటు అతని సోదరుడు కూడా ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు తెలిసింది.

దాడిపై మంత్రి ఈటెల సీరియస్.. వార్నింగ్
వైద్య సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిపై దాడి జరగడం దురదృష్టకరమని అన్నారు. వైద్యులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Recommended Video

109కి చేరిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 109కి చేరుకుంది. బుధవారం ఒక్క రోజే 12 కేసులు నమోదయ్యాయి. కాగా, కరీంనగర్లో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేషియన్లను రామగుండం నుంచి కరీంనగర్కు తీసుకువచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. 11,136 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని, మళ్లీ ఏప్రిల్ 3వ తేదీన మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 619 మంది హోంక్వారంటైన్లో ఉన్నారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన 18 మంది నమూనాలు సేకరించినట్లు తెలిపారు. కాగా, ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చినవారు స్వచ్చందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి సూచించారు. అలా చేయని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications