కరోనా ఎఫెక్ట్ .. ఆ కొరత లేకుండా తెలంగాణా సర్కార్ మరో కీలక నిర్ణయం
కరోనా భారత్ దేశంలోనూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక కరోనాను నియంత్రించటానికి నేడు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు యావత్ దేశ ప్రజలు. తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు 22కి చేరాయి. దీంతో తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. నేడు జనతా కర్ఫ్యూ దేశ వ్యాప్తంగా 14 గంటల అమలు చెయ్యాలని కేంద్రం సూచిస్తే తెలంగాణా సీఎం కేసీఆర్ మాత్రం 24 గంటల పాటు అందరూ జనతా కర్ఫ్యూ కి సహకరించాలని కోరారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కేసీఆర్ తెలంగాణా ప్రజలను కోరారు.
కరోనా విషయంలో ముందస్తు చర్యల్లో భాగంగా టీ సర్కార్ నిర్ణయం
కరోనా ఎఫెక్ట్తో ముందు ముందు మరింత సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని భావిస్తున్న తెలంగాణా సర్కార్ ఈ నేపధ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అనేక చర్యలను తీసుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం ఆస్పత్రుల్లో సిబ్బంది పై దృష్టి పెట్టింది. గత ఐదేళ్లల్లో రిటైర్ అయిన డాక్టర్లను, నర్సులను విధుల్లోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రిటైర్ అయిన వైద్య సిబ్బంది సేవలు వినియోగించుకునేలా ఆలోచన
కరోనా కంట్రోల్ అయ్యి ప్రజా జీవనం సాఫీగా సాగేదాకా ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొదట మూడు నెలల కోసం కాంట్రాక్టు పద్దతిన డాక్టర్లను, నర్సులను తీసుకోనున్నట్లు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అయితే.. వైద్యం అందించేందుకు డాక్టర్ల, నర్సులను కొరత రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రోజు రోజుకీ ప్రమాదకరంగా మారుతున్న కరోనా మహమ్మారి
ఇక భారతదేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువయ్యాయి. ఇండియా వ్యాప్తంగా నేటికి 350 కేసులు నమోదవ్వగా 23 మంది రికవర్ అయ్యారు. ఐదుగురు మరణించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది . ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 22 కరోనా కేసులు నమోదు కావటంతో దీని తీవ్రత ఇంకా పెరుగుతుందనే భావన వ్యక్తం అవుతుంది . దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఈ విపత్తును ఎదుర్కోటానికి ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది.