సోలిపేట రామలింగారెడ్డి ఫ్యామిలీలో నలుగురికి కరోనా: పరామర్శించినవారిలో ఆందోళన
హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరినీ వదలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు కరోనా బారి నుంచి తప్పించుకోవడం లేదు. ఇటీవల సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి చికిత్స పొందుతూ ఆగస్టు 6న కన్నుమూశారు.
సోలిపేట కుటుంబంలో కరోనా కలకలం..
అయితే, సొలిపేట రామలింగారెడ్డి కుటుంబంలో తాజాగా కరోనా కలకలం సృష్టించింది. మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాత, ఆయన కుమారుడు సతీష్ రెడ్డితోపాటు మనవడు, మనవరాలికి కూడా కరోనా సోకినట్లు తేలింది. కాగా, దుబ్బాకలో 25 మందికి కరోనా టెస్టులు చేయగా.. నలుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. కాగా, ఆ నలుగురు కూడా సొలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి చెందినవారే కావడం గమనార్హం.
సోలిపేట కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, ప్రముఖులు..
సోలిపేట రామలింగారెడ్డి మరణించిన అనంతరం సీఎం కేసీఆర్ తోపాటు పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు కూడా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. చాలా మంది అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆ తర్వాత సంతాప సభకు కూడా పెద్ద సంఖ్యలో నేతలు వచ్చారు. ఇప్పుడు సోలిపేట కుటుంబసభ్యులకు కరోనా అని తేలడంతో వారందరిలో ఆందోళన నెలకొంది. వారంత కూడా పరీక్షలు చేయించుకోవడం లేదా హోంక్వారంటైన్లో ఉంటే మేలనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1682 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది మంది మరణించారు. 2070 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 93,937కు చేరుకుంది. ఇందులో 72,202 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 711కు పెరిగింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 21,024గా ఉంది. గృహాలు, ఇన్స్టిట్యూషనల్ ఐసొలేషన్లో 14,140 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కార్యాలయం బులెటిన్ను విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో మొత్తం 19,579 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తమ బులెటిన్లో పేర్కొన్నారు. దీనితో ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 7,72,928కి చేరుకుంది.