గండ్ర రమణారెడ్డి దంపతులకు కరోనా; వరంగల్ జిల్లాలో నిన్న పర్యటించిన మంత్రులకు టెన్షన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతున్న నేటి సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ లో కరోనా కలకలం రేపింది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి కి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రుల బృందానికి కరోనా భయం పట్టుకుంది.
గండ్ర దంపతులకు కరోనా.. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో తిరిగిన గండ్ర దంపతులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వడగళ్ల వానలకు జిల్లాలో పంట బాగా నష్టం జరిగింది. ఈ పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన చేయడానికి మంగళవారం నాడు మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఇతర నేతలు జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించారు. ఇక ఈ పర్యటనలో మంత్రులతో కలిసి గండ్ర వెంకట రమణ రెడ్డి, గండ్ర జ్యోతి దంపతులు కూడా పాల్గొన్నారు. గండ్ర వెంకట రమణారెడ్డి దంపతులు మంత్రులతో కలిసి పరకాల నుండి నర్సంపేటకు హెలికాప్టర్లో వెళ్లారు.
మంత్రుల పర్యటనలో సామాజిక దూరం పాటించకుండా తిరిగిన నేతలు
మంగళవారం జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు గండ్ర దంపతులు. తాజాగా వారికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో, తమతో సన్నిహితంగా ఉన్న నేతలు, కార్యకర్తలు కోవిడ్ టెస్ట్లు చేయించుకోవాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు గండ్ర దంపతులు. ప్రస్తుతం వారిరువురూ హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. నిన్న మంత్రుల పర్యటనలో ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా వారంతా కలిసి పంట నష్టం జరిగిన ప్రాంతాలలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కరోనా పాజిటివ్
ఇదిలా ఉంటే మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తనకు కరోనా సోకిందని పేర్కొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇటీవల తనతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని పేర్కొన్నారు. తనకు స్వల్ప లక్షణాలున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదిలా ఉంటే భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తోపాటు భూపాలపల్లి ఎస్సై కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తెలంగాణలో విపరీతంగా పెరిగిన కరోనా కేసుల సంఖ్య .. ఆందోళన
ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటలలో కొత్తగా 2983 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు మరణించారు. ఇక ఆసుపత్రులలోని వైద్యులకు, పోలీసులకు విపరీతంగా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పదేపదే ప్రభుత్వాలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.