తెలంగాణలో ఒక్కరోజే 75 కొత్త కేసులు, 229కి చేరిక: 11కు చేరిన మరణాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరిన్ని కేసులు కూడా పెరిగే అవకాశం ఉంది.

229కి చేరిన పాజిటివ్ కేసులు
తాజాగా, 75 కేసులు పెరగడంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మరోవైపు కరోనాసోకి కోలుకున్న వారిలో 15 మంది శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 32కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో 186 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

11కు చేరిన మృతుల సంఖ్య..
కాగా, కరోనాతో శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. సికింద్రాబాద్, షాద్ నగర్కు చెందిన వ్యక్తులు మృతి చెందగా.. మృతుల సంఖ్య 11కి పెరిగింది. ఇక, ఢిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారందరినీ ఐసోలేషన్ వార్డులకు తరలించామని, యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

దేశ వ్యాప్తంగా 62కు చేరిన మరణాలు..
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2, 547కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 62 మంది మరణించారు. 2322 యాక్టిక్ కేసులున్నాయని తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య 60వేలకు చేరుకుంది. కరోనా పాజిటివ్ కేసులు 10 లక్షల దాటాయి.
Recommended Video

మోడీ పిలుపునకు కేసీఆర్ మద్దతు.. దీపాలు వెలిగించాలని పిలుపు
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు. కరోనాపై పోరుకు సంఘీభావ సంకేతంగా ప్రజల ఐక్యతను చాటేలా దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు రాష్ట్ర ప్రజలంతా దీపాలు వెలిగించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
మానవ జాతి తనకు పట్టిన పీడపై చేస్తోన్న గొప్ప పోరాటం స్ఫూర్తివంతంగా సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications